ఈనెల 16 నుండి డిసెంబర్ 14 వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు
దర్శనానికి ముందస్తుగా ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
కర్నూలు: కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కార్తీక మాసోత్సవాల్లోనూ దూర దర్శనమే కొనసాగించాలని.. శ్రీశైల దేవస్థానం నిర్ణయించింది. కరోనా నిబంధనల మేరకు స్పర్శ దర్శనం రద్దు చేసినట్లు దేవస్థానం ప్రకటించింది. ఈనెల 16 నుంచి డిసెంబర్ 14 వరకు జరిగే కార్తీక మాసోత్సవాలపై దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల యూనిట్ అధికారులు.. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వైద్యులు, పోలీసులు..కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తులకు చేయాల్సిన ఏర్పాట్లు.. కరోనా నిబంధనలు.. విధి విధానాలు.. వాటి అమలు గురించి సుదీర్ఘంగా చర్చించి ఖరారు చేశారు.
శ్రీశైలం రావాలంటే పాటించాల్సిన నిబంధనలు
దర్శనానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి
భక్తులు ఆధార్కార్డు / గుర్తింపుకార్డుతో రావడం తప్పనిసరి
టైమ్స్లాట్ పద్దతిలో అనగా కేటాయించిన నిర్ణీత సమయాలలో దర్శనాలకు అనుమతి
క్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందస్తుగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం
భక్తులు మాస్కును ధరించడం, భౌతికదూరాన్ని పాటించడం తప్పనిసరి
కోవిడ్ నియంత్రణలో భాగంగా స్వామివార్ల అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి
10 నుండి 65 ఏళ్ల లోపు వయస్సు గల వారికి మాత్రమే దర్శనాలకు అనుమతి
ఆర్జిత సేవలు.. ఉత్సవాలు
ప్రతిరోజూ నాలుగు విడతలుగా సామూహిక ఆర్జిత అభిషేకాలు
కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన మరియు పుష్కరిణి హారతి
నవంబరు 29వ తేదీన జ్వాలా తోరణోత్సవం
భక్తులు కార్తిక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద ప్రత్యేక ఏర్పాటు.