కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే. ఈ మాసంలో చేసిన పూజలు, దానధర్మాలు, పురాణ శ్రవణంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అటు హరికి, ఇటు హరుడికి మరోపక్కన వారిద్దరి తనయుడైన అయ్యప్పకు కూడా ఇష్టమైన మాసమిది. కార్తీక పౌర్ణమిని కౌశిక లేదా 'వైకుంఠ పౌర్ణమి' అని కూడా అంటారు.తెలంగాణలో కొన్ని చోట్ల 'జీడికంటే పున్నమి' అని కూడా పిలుస్తారు
ఏ డాదంతా ఇష్టదైవానికి దీపారాధన చేయకపోయినా... ఈ ఒక్క నెలలో 365 వత్తులు వెలిగిస్తే చాలని పురాణాలు చెబుతున్నాయి. ఎక్కడైతే దీపాలు వెలిగించి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం.
కార్తీకమాసం .. పౌర్ణమి రోజున ( 2025 నవంబర్ 5) భక్తులు శివారాధన చేస్తారు. దీపారాధనతోపాటు, శివుడికి అభిషేకాలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. వైష్ణవ దేవాలయాల్లోనూ దీపారాధన జరుగుతుంది. భక్తులు కార్తీక పౌర్ణమి రోజు తులసి, రుద్రాక్ష, స్పటిక మాలలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు. వ్రతాలను భక్తిశ్రద్ధలతో ఉపవాసాలతో ఆచరిస్తారు. శుద్ధ పూర్ణిమ రోజున కృత్తికా దీపోత్సవం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం. దీపారాధన చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు.
దీపారాధన ఇలా
హిందూ సంప్రదాయంలో దీపానికి గొప్ప ప్రత్యేకత ఉంది. దీపం కాంతికి చిహ్నం. జీవానికి సాక్ష్యం. అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉండాలని పెద్దలు చెబుతారు. కార్తీక పౌర్ణమి రోజు తలారా స్నానం చేసి, పూజలు చేసి, ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి. ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో ప్రతి రోజూ సాయంకాలం విష్ణు అర్పణంగా ఎవరైతే నూనెతో దీపం వెలిగిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. అందుకు ఉసిరి దానం చేసినా, ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఒకప్పుడు వనభోజనాలు ఉసిరి చెట్టు దగ్గరే చేసుకునేవాళ్లు.
కార్తీక స్నానం..!
పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు. నదిలో స్నానమాచరించి, అక్కడే దైవాన్ని దర్శించి, గుళ్లో దీపాలు వెలిగించాలి. నదుల్లో దీపాలను వదిలేయాలి. నదులకు వెళ్లలేని వాళ్లు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి, దైవాన్ని పూజించి, దీపారాధన చేయాలి. ఇంటి ముందున్న తులసికోట దగ్గర దీపాలను వెలిగించడం మంచిది. దగ్గర్లోని గుడికి వెళ్లి దీపాలు వెలిగించాలి.
పౌర్ణమి రోజు కార్తీక స్నానం చేసేసమయంలో కార్తీకే హం.. కరిష్యామి వ్రత స్నానం జనార్ధన.. ప్రీత్యర్థం.
దేవేశ దామోదర మయనహ (ఓ జనార్ధనా. కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే స్నానమాచరిస్తున్నాను. నన్ను రక్షించు)' అనే మంత్రం చదివితే ఎంతో పుణ్యం లభిస్తుంది.
ఉపవాసం
ఈ నెలలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది. అందులో ఉపవాసం ఒకటి. ఈ నెలలో ఇష్టదైవానికి ఉపవాసం ఉండటం ఎంతో మంచిది. ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ కూడా చెప్తుంది.
కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'సక్రమ్' అంటారు. పగలంతా ఆహారం లేకుండా ఉండలేనివాళ్లు పాలు పండ్లు తీసుకోవచ్చు. సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు చేయాలి. సూర్యభగవానుడు తన కిరణాలతో సౌరశక్తిని నదీజలాలపై ప్రసరింప చేస్తాడు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన వారి శరీరాలకు దీనివల్ల సౌర శక్తి లభిస్తుంది.
దీపారాధన శ్రేయస్కరం
కార్తీక పౌర్ణమి రోజు తలస్నానం చేసి పూజలు చేయాలి. ఉపవాసం ఉండి సాయంత్రం ఆవు నెయ్యి లేదా నువ్వులు నూనెతో దీపాలను వెలిగించాలి.. దీపాన్ని దానం చేయడం శ్రేయస్కరం. బియ్యప్పిండి లేదా గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి దానం చేయాలి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నదీ స్నానాలు ఆచరించడం ఉత్తమం. పౌర్ణమి రోజు ఇంట్లో తులసి పూజలు చేసి, కార్తీక వత్తులు వెలిగించాలి. ఇది యజ్ఞాలతో సమానమని పండితులు చెబుతున్నారు.
వెలుగు, లైఫ్
