బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్లకు సోషల్ మీడియా ద్వారా ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబయిలోని శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరినీ చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆగంతకుడిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇలా నటీనటులను బెదిరించడం కొత్తేమీ కాదు. అప్పట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు బెదిరింపు లేఖలు వచ్చిన సంగతి తెలిసిందే. గత నెలలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బి ష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ను చంపెస్తామని బెదిరింపు లేఖలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రాణాహాని ఉందని.. స్వీయ రక్షణ కోసం లైసెన్స్ గన్ కావాలని ముంబయి పోలీసులకు సల్మాన్ దరఖాస్తు చేసుకున్నాడు. అంతకుముందు నటి స్వరా భాస్కర్కు కూడా చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించారు. రైతు ఉద్యమం సందర్భంలో కంగనా రనౌత్కి కూడా బెదిరింపులు వచ్చాయి.
2021లో విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ ఎలాంటి విమర్శల్లోనూ ఇన్వాల్వ్ కాని ఈ జంట దాంపత్య జీవితం సంతోషంగా కొనసాగుతోంది. సినిమాలతో బిజీగా ఉంటూనే.. ఖాళీ సమయాల్లో వెకేషన్స్ కు వెళ్తూ.. ఈ కపుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరికి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు మొదలయ్యాయి. వీరిద్దరికీ (డెత్ థ్రెట్)ప్రాణ హాని ఉందని తెలుసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ కేసులో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కానీ అధికారులు మాత్రం ఎవరినీ అరెస్టు చేయలేదని స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటు ఈ బాలీవుడ్ జంటకు రక్షణ కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.