- హైడ్రా వాటిని కూల్చేయాలని డిమాండ్
- కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జాగృతి జనంబాట
జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ఎమ్మెల్యే వివేకానంద అండదండలతోనే నియోజకవర్గంలోని పరికిచెరువు హద్దులు మార్చి.. రియల్ మాఫియా కబ్జా చేసిందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. 62 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన పరికి చెరువును రియల్ ఎస్టేట్మాఫియా 15 ఎకరాలు చేసిందన్నారు. చెరువు పరిరక్షణ కోసం స్థానికులు ఎంత పోరాడినా.. రాజకీయ అండతో మాఫియా చెలరెగిపోతున్నదని మండిపడ్డారు.
జాగృతి జనం బాటలో భాగంగా శుక్రవారం రెండోరోజు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్నియోజకవర్గంలో కవిత పర్యటించారు. ఐడీపీఎల్ నుంచి ర్యాలీ నిర్వహించిన అనంతరం గాజుల రామారంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి.. పరికి చెరువు, అర్బన్ హెల్త్ సెంటర్ను పరిశీంచారు.
మల్లంపేటలో జరిగిన జాగృతి చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గిల్లాపూర్లో పర్యటించారు. కవిత మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వివేకానంద్ గతంలో టీడీపీలో ఉన్నారని.. ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతున్నారని.. రేపు ఏ పార్టీలో ఉంటాడో తెల్వదని ఎద్దేవా చేశారు. చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పేదవాళ్ల ఇండ్లనే కాదు పెద్దల కబ్జాలను కూడా కూలుస్తామని జనాలకు మేసేజ్ ఇవ్వాలని సూచించారు. పార్కు స్థలాన్ని కూడా కబ్జాచేశారని, ఈ విషయమై సర్కిల్ అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదన్నారు.
అన్ని పార్టీలు మోసం చేశాయి
కుత్బుల్లాపూర్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి 100 పడకల హస్పిటల్ కడతామని హమీలు ఇచ్చి గెలిచినవారు.. అనంతరం ఆ విషయాన్నే పట్టించుకోలేదని కవిత మండిపడ్డారు. ఇక్కడి ప్రజలను అన్ని పార్టీలు మోసం చేశాయన్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంతోపాటు ఆశావర్కర్లు, ఏఎన్ఎంల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. ఏడాది కిందట ఏఎన్ఎంలకు పరీక్ష పెట్టి.. ఇప్పటివరకు ఫలితాలివ్వడం లేదంటే ప్రభుత్వ పనితీరు అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్లో జాయిన్ అయిన ఏఎన్ఎంలకు సీనియారిటీ ప్రకారం వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, ఏఎన్ఎంలకు సరైన సమయానికి జీతాలివ్వా లని కోరారు. ఏఎన్ఎంలకు ట్యాబ్లు ఇవ్వాలని, ఫోన్లలో సొంత డేటా వాడుతూ అర్ధరాత్రి వరకూ పనులు చేయాల్సి వస్తున్నదని చెప్పారు.
