గ్రేటర్లో గ్రే వాటర్ బ్యాంక్.. మురుగునీటి అమ్మకానికి వాటర్బోర్డు ప్లాన్ 

గ్రేటర్లో గ్రే వాటర్ బ్యాంక్.. మురుగునీటి అమ్మకానికి వాటర్బోర్డు ప్లాన్ 
  • బోర్డు,  ప్రైవేట్​ ఎస్టీపీల నుంచి నీటి సేకరణ
  • బిల్డింగుల నిర్మాణం, గార్డెనింగ్​కు ఉపయోగించేలా ప్రణాళిక
  • నామినల్​చార్జీలతో సరఫరా

హైదరాబాద్​సిటీ, వెలుగు:గ్రేటర్ లో రోజు రోజుకూ భారీగా పెరుగుతున్న నీటి డిమాండ్​ను అధిగమించడంతో పాటు, శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించుకునేలా వాటర్​బోర్డు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఔటర్​వరకూ బోర్డును విస్తరించడంతో నీటికి భారీగా డిమాండ్​పెరుగుతోంది. దీంతో పాటు వృథా కూడా ఎక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ‘గ్రే వాటర్​బ్యాంక్​’ను ఏర్పాటు చేయాలని బోర్డు భావిస్తోంది.

కేవలం బోర్డు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటినే కాకుండా ప్రైవేట్ సంస్థలు అంటే భారీ అపార్ట్​మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి కూడా శుద్ధి చేసిన నీటిని సేకరించనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రీటెడ్ వాటర్​నిల్వచేసేందుకు రిజర్వాయర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ నీటిని గార్డెనింగ్, ప్లాంటేషన్, భవన నిర్మాణాలకు సరఫరా చేయాలని అనుకుంటున్నారు.

కన్సల్టెన్సీకి డీపీఆర్ బాధ్యతలు

శుద్ధి చేసిన నీటిని వాడుకునే విషయమై డీపీఆర్​ తయారీకి ఇటీవలే ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఠండన్​కు బాధ్యతలు అప్పగించారు. ఈ సంస్థ గ్రేటర్​పరిధిలో ఉత్పత్తి అవుతున్న లెక్కలోకి రాని మురుగునీరు ఎంత? ప్రస్తుతం అపార్ట్​మెంట్లు, విల్లాలు, గేటెడ్​ కమ్యూనిటీలు, ఇండస్ట్రీస్​లో నిర్వహిస్తున్న ఎఫ్ల్యూయెంట్​ ప్లాంట్​(పరిశ్రమలు, అపార్ట్​మెంట్లలో నీటి శుద్ధి ప్లాంట్లు)లలో ఎంత మురుగునీరు ఉత్పత్తి అవుతోంది? ఎంత శుద్ధి జరుగుతోంది? శుద్ధి చేసిన నీటిని ఏం చేస్తున్నారన్న విషయాన్ని స్టడీ చేస్తారు. భవిష్యత్​లో ట్రీటెడ్​వాటర్​ మేనేజ్​మెంట్​పై నివేదికను అందజేస్తారు.  

డయల్​ ఏ గ్రేటర్​ట్యాంకర్​

మెట్రోవాటర్​బోర్డు గ్రేటర్​లోని వివిధ ప్రాంతాల్లో 40 ఎస్టీపీలను నిర్వహిస్తోంది. సిటీలో రోజుకు 1950 ఎంల్​ఎల్​డీల మురుగునీరు ఉత్పత్తి అవుతుండగా..ఇందులో రోజుకు 950 ఎంఎల్​డీలు మాత్రమే శుద్ధి జరుగుతోంది. రాబోయే రెండేళ్లలో మరో 39 ఎస్టీపీలు సిద్ధమవుతాయి. దీంతో వంద శాతం మురుగునీటి శుద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. అపార్ట్​మెంట్లు, విల్లాలు, గేటెడ్​ కమ్యూనిటీలతో పాటు కొన్ని పరిశ్రమల్లోనూ మురుగునీటి శుద్ధి ప్లాంట్లున్నాయి. ఆయా సంస్థల పరిధిలో 500 వరకూ ఎస్టీపీలున్నాయి. ప్రస్తుతం వాటర్ బోర్డు శుద్ధి చేసిన నీటిని మూసీలోకి వదులుతుండగా, ప్రైవేట్ సంస్థలకు చెందిన ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని డ్రైనేజీల్లోకి  వదులుతున్నారు. 

ఈ పరిస్థితిని అధిగమించడానికి త్వరలో ప్రైవేట్​ఎస్టీపీల నుంచి కూడా శుద్ధి చేసిన నీటిని సేకరించనున్నారు. ఈ నీటిని నిల్వ చేసేందుకు ఎంపిక చేసిన ప్రాంతాల్లో రిజర్వాయర్లను, తర్వాత సరఫరా చేసేందుకు ఫిల్లింగ్​స్టేషన్లను నిర్మించనున్నారు. ప్రైవేట్​సంస్థల నుంచి సేకరించిన నీటి నాణ్యతను బట్టి వారికి కొంత మొత్తాన్ని కూడా చెల్లించనున్నారు. ఇందు కోసం సిటీలోని ప్రైవేట్​ఎస్టీపీల వివరాలను బోర్డు అప్​డేట్​చేస్తోంది. ఎప్పటికప్పుడు వారు ఉత్పత్తి చేసిన ట్రీటెడ్​వాటర్​ క్వాంటిటీ, క్వాలిటీపై అధికారులు మానిటర్​చేస్తారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు బుకింగ్​ కోసం వాటర్​బోర్డు ఐటీ ప్లాట్​ఫామ్​ను వినియోగిస్తారు. డయల్​ ఏ వాటర్​ట్యాంకర్​లాగా డయల్​ఏ గ్రేటర్​ ట్యాంకర్​ అందుబాటులోకి తీసుకు వస్తారు. 

నామమాత్రపు చార్జీలతో సరఫరా

గ్రేటర్​పరిధిలోని అన్ని ఎస్టీపీల్లో శుద్ధి చేసిన  నీటిని.. భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఓఆర్ఆర్​పొడవునా ప్లాంటేషన్​కు, నగరంలోని గార్డెనింగ్​పనుల కోసం, క్లీనింగ్​అవసరాలకు నామమాత్రపు చార్జీలతో సరఫరా చేయనున్నారు. దీనివల్ల తాగునీటిని ఇతర అవసరాలకు వాడే అవకాశం ఉండదని, నీటి వృథాను అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు.