
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గడం లేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె.. వరుసగా రెండో రోజూ అవే కామెంట్లు చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు.
‘‘బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయడాన్ని నేను అస్సలు ఒప్పుకోను. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదు. ఎన్నో ఆవేదనలు భరించలేక, పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లెటర్ రాశాను. దాన్ని ఎవరు లీక్ చేశారో తేల్చాలి. నాకు ప్రత్యేక జెండా.. ఎజెండా లేదు. పార్టీని కాపాడుకోవడమే నా ఏకైక ఎజెండా” అని కవిత తెలిపారు.
‘‘కేసీఆర్ను కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయాను. పెద్దాయనను ఎవరేమన్నా ఊరుకోను. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు” అని ప్రశ్నించారు. తాను లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ ప్రజలు అనుకుంటున్నవేనని పేర్కొన్నారు.