కవిత మేనల్లుడు శ్రీ శరణ్ చేసే వ్యాపారం ఏంటి? లావాదేవీలు ఏంటి?

 కవిత మేనల్లుడు శ్రీ శరణ్ చేసే వ్యాపారం ఏంటి? లావాదేవీలు ఏంటి?
  • శ్రీశరణ్​ బిజినెస్​, లావాదేవీలు ఏమిటి?
  • లిక్కర్​ స్కామ్​ కేసులో కవితను ప్రశ్నించిన ఈడీ

న్యూఢిల్లీ, వెలుగు:  ఢిల్లీ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కామ్​ మనీలాండరింగ్ వ్యవహారంలో ఎనిమిదో రోజు ఆదివారం బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా కస్టడీ పొడిగింపు అప్లికేషన్ లో మెన్షన్ చేసిన అంశాలపై ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ లో నగదు బదిలీ, వినియోగంలో కీలక పాత్ర పొశించిన కవిత మేనల్లుడు మేక శ్రీశరణ్ టార్గెట్​గా ఆమెను విచారించినట్లు తెలిసింది. శ్రీశరణ్ బిజినెస్, లావాదేవీల అంశంపై ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. ఐటీఆర్, కుటుంబ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు రకాల సమాచారాన్ని ఈడీ అధికారులు అడిగినట్లు తెలిసింది.

ఇప్పటికే ఈ అంశాలపై కవితను ప్రశ్నించిన ఈడీ.. ఆమె నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయామని శనివారం కోర్టు దృష్టికి తెచ్చింది. పైగా కవిత తమ ప్రశ్నల నుంచి తప్పించుకునేందుకు కుంటి సాకులు చెప్తున్నారని, విచారణకు సహకరించడంలేదని ఈడీ పేర్కొంది. కవిత కస్టడీని మరో మూడు రోజులకు కోర్టు పొడిగించడంతో.. ఆదివారం ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించారు. 

సమీరు మహేంద్రు నుంచి కూడా..!

కవిత నుంచే కాకుండా.. లిక్కర్ వ్యాపారి సమీర్ మహేంద్రు వైపు నుంచి కూడా లిక్కర్​ స్కామ్​లో శ్రీశరణ్ పాత్రపై ఆరా తీసేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ముందు విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సమీర్ మహేంద్రుకు సమన్లు జారీ చేశారు.  అయితే ఏ రోజు సమీర్ ను విచారిస్తారనే అంశాన్ని బయటకు చెప్పేందుకు ఈడీ అధికారులు ఒప్పుకోవడం లేదు. కేవలం సమీర్ ను ఒక్కడినే విచారిస్తారా..? లేక ఇప్పటికే ఈ కేసులో అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ లోని కవిత మాజీ సీఏ బుచ్చిబాబు, మాగుంట రాఘవ్, మాగుంట శ్రీనివాస్​తో కలిపి విచారిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. 

ఇతరులతో కలిపి కవితను విచారించే చాన్స్​

తొలి ఏడు రోజులు కస్టడీలో భాగంగా ఐదు రోజులు మాత్రమే కవితను ఈడీ అధికారులు విచారించారు. ఇదే టైంలో మరో నలుగురు వ్యక్తులను కూడా ఈడీ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఈ సందర్బంగా వీళ్లు ఇచ్చిన స్టేట్​మెంట్ల ఆధారంగా కవితను క్రాస్ ఎగ్జామిన్ (కన్ఫట్రంటేషన్) చేసినట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. రూ. 100 కోట్ల ముడుపులు, మరో రూ.192.8 కోట్ల అక్రమార్జనతో కలిపి మొత్తం రూ. 292.8 కోట్ల వ్యవహారంలో కవిత భాగస్వామ్యం ఉన్నట్లు ఈడీ చెప్తున్నది. దీనికి సంబంధించి కవిత పాత్ర, ఆమె మేనల్లుడు శ్రీశరణ్ కీ రోల్ పై మరికొందరిని విచారించాల్సి ఉందని పేర్కొంది.

ALSO READ :- విజయ శాంతి దిల్ రాజులకు దక్కని సీట్లు

 విచారించాల్సిన జాబితాలో ఉన్న వ్యక్తులతో కవితను కలిపి ప్రశ్నించే అవకాశం ఉందని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఈ జాబితాలో ఇండో స్పిరిట్​లో  కవిత కు డమ్మీ పర్సన్ గా వ్యవహరించిన అరుణ్ రామ చంద్రపిళ్లై, అరబిందో కంపెనీ డైరెక్టర్ శరత్ చంద్ర పేర్లు వినిపిస్తున్నాయి. ఆప్ తరపున స్కామ్​లో ప్రధాన పాత్రధారిగా ఉన్న విజయ్ నాయర్ ను విచారించనున్నట్లు తెలిసింది. కాగా, ఆదివారం కూడా కవితను ఆమె కుటుంబ సభ్యులు కలిశారు.