సఫారీ చేద్దాం చలో చలో.. కవ్వాల్​ ఫారెస్టుకు పెరుగుతున్న టూరిస్టుల తాకిడి

సఫారీ చేద్దాం చలో చలో.. కవ్వాల్​ ఫారెస్టుకు పెరుగుతున్న టూరిస్టుల తాకిడి
  •    తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకుల రాక  
  •     ఆకట్టుకుంటున్న అటవీ అందాలు, వన్యప్రాణులు  
  •     ఫారెస్ట్, టూరిజం డిపార్ట్​మెంట్ల ప్రత్యేక ఏర్పాట్లు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా జన్నారం కేంద్రంగా ఉన్న కవ్వాల్ టైగర్ ఫారెస్టు ఎకో టూరిస్టులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర స్టేట్స్​నుంచి కూడా  టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇక్కడి అటవీ అందాలను, రకరాల వన్యప్రాణులను, పక్షిజాతులను చూసి ఫిదా అవుతున్నారు. ఫారెస్ట్, టూరిజం డిపార్ట్​మెంట్ల ఆధ్వర్యంలో జంగిల్​సఫారీ ఏర్పాటు చేయడంతో పాటు టూరిస్టులకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నారు. దీంతో హాలిడేస్ లో పలువురు ఫ్యామిలీతో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. 

కనువిందు చేసే అటవీ అందాలు..

కవ్వాల్​ టైగర్​ ఫారెస్ట్​ అంటేనే ప్రకృతి అందాలకు నెలవు. దట్టమైన అడవులు, ఎత్తైన గుట్టలు, కనుచూపుమేరలో ఎటుచూసినా పచ్చదనం పరుచుకుని కనువిందు చేస్తోంది. ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పలుచోట్ల వాచ్​టవర్లు నిర్మించారు. జంతువులకు నీటి వసతి కోసం కుంటలు తవ్వారు. వాటిదగ్గర వుడెన్​ బ్రిడ్జిలు, కాటేజీలు ఏర్పాటు చేశారు.

కొన్ని చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో గడ్డ క్షేత్రాలను పెంచుతున్నారు. ఈ అడవిలో చుక్కల జింకలు, కోతులు, కొండెంగలు, అడవిపందులు, అడవి దున్నల గుంపులను చూడొచ్చు. ఉదయం, సాయంత్రం వేళల్లో అవి స్వేచ్ఛగా అడవిలో విహరిస్తుంటాయి. అడవి కుక్కలు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వైల్డ్​యానిమల్స్​ సైతం అక్కడక్కడా తారసపడుతుంటాయి. సుమారు 300 రకాల పక్షులను కవ్వాల్​ఫారెస్ట్​లో గుర్తించారు. ఏటా నిర్వహించే బర్డ్​వాచ్​ఫెస్టివల్​కు రాష్ర్టం నలుమూలల నుంచి బర్డ్​లవర్స్​పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.

ఆహ్లాదకరంగా సాగే జంగిల్​సఫారీ..

ఫారెస్ట్​, టూరిజం డిపార్ట్​మెంట్ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్​సఫారీలో విహరిస్తూ కవ్వాల్​అందాలను ఆస్వాదించవచ్చు. రెండు డిపార్ట్​మెంట్ల నుంచి తొమ్మిది సఫారీ వెహికల్స్​ఏర్పాటు చేశారు. ఉదయం 6 నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు సఫారీ ద్వారా అడవిలో తిప్పుతారు. గోండుగూడ బేస్ ​క్యాంప్, వాచ్​టవర్, బైసన్​కుంట, మైసమ్మకుంట, గనిశెట్టికుంటలను చూపిస్తారు. బైసన్​కుంట వద్ద చుక్కల దుప్పులు, అడవి దున్నలు గుంపులుగా కనిపిస్తాయి. అక్కడే ఉన్న ఎన్విరాన్​మెంటల్​ స్టడీ సెంటర్​లో జంతువుల ఎముకలు, పుర్రెభాగాలు చూడొచ్చు. దట్టమైన అడవిలో సుమారు 20 కిలోమీటర్లు జంగిల్​సఫారీ ఆహ్లాదకరంగా సాగుతుంది. ఈ టూర్​మర్చిపోలేని అనుభూతిగా మిగిలిపోతుదంటే అతిశయోక్తి కాదు. 

సఫారీ కాస్త ఖరీదే.. 

జంగిల్​ సఫారీ కోసం కొత్త లగ్జరీ వెహికల్స్​ ఏర్పాటు చేయడంతో సఫారీ కాస్త ఖరీదుగా మారింది. ఒక్కో వెహికల్​లో ఆరుగురు ప్రయాణించవచ్చు. ట్రిప్​కు రూ.5వేలు వసూలు చేస్తారు. అదనంగా ఎక్కితే ఒక్కొక్కరికి రూ.500 చెల్లించాలి. వీకెండ్స్​లో కవ్వాల్​ ఫారెస్ట్​కు టూరిస్టుల తాకిడి విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టూరిస్టులు ఎక్కువగా వస్తున్నారు. పిల్లలు మాత్రం ఫుల్​ఎంజాయ్​ చేస్తున్నారు. జన్నారంలో టూరిజం డిపార్ట్​మెంట్​ఆధ్వర్యంలో హరిత కాటేజీలు, రెస్టారెంట్​ అందుబాటులో ఉన్నాయి.

సోమవారం నుంచి గురువారం వరకు నాన్​ఏసీ రూమ్​కు రూ.1,064, ఏసీ రూమ్​కు రూ.1,624, డార్మెటరీకి రూ.1,600 చార్జి చేస్తున్నారు. శుక్ర, శని, ఆది వారాల్లో నాన్​ఏసీకి రూ.1,176, ఏసీకి 1,792, డార్మెటరీకి రూ.1,800 చెల్లించాలి. వీకెండ్స్​లో సందర్శించేవారు వారం ముందే ఆన్​లైన్​లో రూమ్​లు, జంగిల్​ సఫారీ బుక్​ చేసుకోవాల్సి ఉంటుంది.