- రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాల్ రెడ్డి ఫైర్
ముస్తాబాద్, వెలుగు: కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీఆర్ఎస్ నాయకులు.. నేడు రేవంత్ సర్కార్ పై నిందలు వేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ల బాల్ రెడ్డి దుయ్యబట్టారు. ముస్తాబాద్ లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు గజ్జెల రాజు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న గుడికి ఏటా రూ.100 కోట్లు మంజూరు చేస్తానన్నారని, దళితుడిని సీఎం చేస్తానని ప్రగల్బాలు పలికారని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఎగ్గొట్టారని, రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, సిరిసిల్ల నేతన్నలకు బకాయిలు పెండింగ్ పెట్టారని, ఒక్కరేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
ఇన్ని హామీలు ఇచ్చి మాట తప్పిన కేసీఆర్,బీఆర్ఎస్ నాయకులు ఇయ్యాల రేవంత్ సర్కార్ మాట తప్పిందని నానా హంగామా చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజన్న గుడికి ఏటా రూ.100 కోట్ల నిధులు ఇస్తానని మాట ఇచ్చి తప్పినందుకు ముందుగా మీ వైఫల్యాలపై బాకీ కార్డు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ నీచమైన రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్ర నేత చక్రధర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రాజిరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, రంజాన్ నరేశ్, మహేశ్ రెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
