కేసీఆర్ కు ఎన్నికలు తప్ప ఏం పట్టవు

కేసీఆర్ కు ఎన్నికలు తప్ప ఏం పట్టవు

తెలంగాణ రాష్ట్రంలో అసలేం జరుగుతోందో తెలియడం లేదన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు.సీఎం కేసీఆర్ కు ఎన్నికలు తప్ప రాష్ట్ర సమస్యలు ఏ మాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గరే  చనిపోతున్నా కేసీఆర్ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదన్నారు. కామారెడ్డి జిల్లా రైతు మామిడి బీరయ్య ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర  9 రోజులుగా పడిగాపులు గాసి.. చివరకు ఆలస్యాన్ని తట్టుకోలేక.. ధాన్యం కుప్పలపైనే మరణించడం అత్యంత బాధాకరమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రైతులను అత్యంత హీనంగా  చూస్తోందని విమర్శించారు. పంటలకు పట్టే చీడలా అన్నదాతల శ్రమని, రక్తాన్ని పీల్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. 

వరి ధాన్యం కొనుగొలు విషయంలో నల్లగొండ, కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా రైతులు అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పారు మధు యాష్కీ. అమ్మకాల టోకెన్ల కోసం కూడా రైతులు తోపులాటలు.. తన్నుకునే పరిస్థితిని కేసీఆర్ తీసుకువచ్చాడని అన్నారు. సన్నరకం బియ్యం మార్కెట్లో 25 కిలోలు రూ.1000 వరకూ ఉంటే.. మద్దతు ధరకు మంగళం పాడి ఇక్కడ క్వింటాలుకు రూ. 1650కే మిల్లర్లు కొనుగోలు చేసేలా ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. రైతులను నిట్టనిలువునా ముంచేస్తూ  ప్రభుత్వం దగా చేస్తోందన్నారు. 

వరి ధాన్యం రైతులకు మద్దతు ధర ప్రకటించకపోతే.. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచార కమిటీ దీనిపై  రాష్ట్రంమంతా ఉద్యమిస్తుందన్నారు మధు యాష్కీ గౌడ్.