కొత్త పింఛన్లు ఇస్తలే.. ఉన్నయ్ తీసేస్తున్నరు

కొత్త పింఛన్లు ఇస్తలే.. ఉన్నయ్ తీసేస్తున్నరు
  • కొత్తగా అర్హత పొందిన 3.15 లక్షల మందికి పైసలిస్తలే
  • సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే  7,395 మంది ఎదురుచూపులు

హైదరాబాద్, వెలుగు: చనిపోయిండ్రని, ఊర్లో ఉంటలేరని, వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోలేదని కారణాలు చూపెట్టి ఆసరా పింఛన్ల జాబితాలో ఎప్పటికప్పుడు పేర్లు తొలగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కొత్తగా అర్హత సాధించిన వాళ్లకు మాత్రం పెన్షన్​ఇస్తలేదు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక గడిచిన మూడున్నరేండ్లలో వివిధ కారణాలతో 3 లక్షల ఆసరా పెన్షన్లను తొలగించింది. కొత్తగా 3.15 లక్షల మందిని పెన్షన్​కు అర్హులుగా గుర్తించినా.. వారికి పైసలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో వాళ్లు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్ రాక  ఇబ్బందులు పడుతున్నారు. వితంతువులకు కుటుంబ పోషణ, వృద్ధులకు మందుల ఖర్చులు ఇబ్బందిగా మారింది. ఐదు నెలల కింద ఎన్నికలు జరిగిన హుజూరాబాద్ నియోజకర్గంలో తప్ప రాష్ట్రంలో ఎక్కడా కొత్త పెన్షన్ ఇచ్చినా దాఖలాల్లేవు. 

నెలకు 8 వేల పెన్షన్లు కట్..

రాష్ట్రంలో 2018 ఆగస్టు నాటికి ఆసరా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 39,42,371గా ఉంటే జనవరి 2022 నాటికి ఆ సంఖ్య 36,42,999కి పడిపోయింది. అంటే గత మూడున్నరేండ్లలో దాదాపు మూడు లక్షల  పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.  అనారోగ్యం, ఇతర కారణాలతో చనిపోయిన లబ్ధిదారులు, వరుసగా మూడు నెలలు పింఛన్‌‌‌‌ తీసుకోని లబ్ధిదారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తున్నది. ఇట్లా నెలనెలా 6 వేల నుంచి 8 వేల మంది పేర్లను తీసేస్తున్నది. ఒక్క 2019లోనే ఆసరా జాబితా నుంచి ప్రభుత్వం తొలగించిన పింఛన్ల సంఖ్య1,16,534. ఆ ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్​లో ఒకేసారి 52,082 మంది పేర్లను తీసేసింది.  దీంతో సుమారు రూ. 50 కోట్ల ఆసరా నిధులు సర్కారు మిగిలించుకుంటున్నది. తొలగించిన వారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్లకు ఇచ్చే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

కొత్త పింఛన్లు ఆపిన్రు

అన్ని అర్హతలున్నా మూడేండ్ల నుంచి కొత్త పెన్షన్లు రావడం లేదు. 65 ఏండ్లు నిండినోళ్లకు, యాక్సిడెంట్లతోనో, పుట్టుకతోనో దివ్యాంగులుగా మారినోళ్లకు, భర్త చనిపోయిన వాళ్లకు, 50 ఏండ్లు నిండిన గీత కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ వర్కర్స్, ఒంటరి మహిళలు, హెచ్ఐవీ పేషెంట్లు, ఫైలేరియా బాధితులు ఈ మూడేండ్లలో 3,15,262 మంది పెన్షన్ కు అర్హులని సర్కార్ ఆమోద ముద్ర వేసినప్పటికీ.. పైసలు మాత్రం ఇవ్వడం లేదు. వీరిలో అత్యధికంగా1,59,452 మంది వితంతువులు ఉండగా, ఆ తర్వాత 65 ఏండ్లు నిండినోళ్లు 64,749 మంది ఉన్నారు. మరో 55,619 మంది దివ్యాంగులు, 6,351 మంది గీత కార్మికులు, 5,620 మంది బీడీ కార్మికులు, 3,297 మంది చేనేత కార్మికులు,10,997 మంది ఒంటరి మహిళలు, 5,485 మంది హెచ్ఐవీ పేషెంట్లు, 3,692 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. వీరికి ఆసరా పెన్షన్  అప్రూవ్​ అయినట్లు ఆన్​లైన్​లో చూపెడుతున్నా.. పెన్షన్లు మాత్రం రావట్లేదు.    

సిద్దిపేటలో పెండింగ్ లో 7,395  పెన్షన్లు

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 3.15 లక్షల పెన్షన్లలో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 24,974, నల్గొండ జిల్లాలో 22,555, రంగారెడ్డి జిల్లాలో 20,251 ఉన్నాయి. సీఎం సొంత జిల్లా సిద్దిపేట జిల్లాలో 7,395  మందికి ఆసరా పింఛన్ పొందేందుకు అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు. ఖమ్మం జిల్లాలో 19,130 , నిజామాబాద్ లో 14,053 పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. మిగతా జిల్లాల్లోనూ ఒక్కో చోట 5 వేలకు పైగా పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. 

బాధితులతో నేడు పబ్లిక్​ హియరింగ్​

మూడేండ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వకపోవడం దారుణం. కౌలు రైతులు చనిపోతే పరిహారం అందట్లేదు. వాళ్ల భార్యలకు వితంతు పింఛన్ వస్తలేదు. బాధితులతో సోమవారం ధర్నా చౌక్ లో రైతు స్వరాజ్య, మానవ హక్కుల వేదిక తదితర 20 సంఘాల ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించబోతున్నం. ప్రభుత్వం స్పందించి 3.15 లక్షల మంది అర్హులకు వచ్చే నెల నుంచి పింఛన్​ను అకౌంట్ల లో వేయాలి.

- కొండల్ రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక, కన్వీనర్

ఏడాదిన్నర అయింది

కూలీనాలీ చేసుకుని బతికే కుటుంబం మాది. నా భర్త ఏడాదిన్నర కింద చనిపోయిండు. పింఛన్ కోసం అప్లయ్​ చేసిన. ఇప్పటికీ పింఛన్ ఇస్తలేరు. పంచాయతీ ఆఫీసులో అడిగితే దాటవేస్తున్నరు. సర్కారు పింఛన్ ఇయ్యాలె.

- పొట్రు వెంకటమ్మ, చెన్నూరు(కల్లూరు), ఖమ్మం

పింఛన్​ వస్తలేదు..

నా భర్త ఏడాది కింద చనిపోయిండు. నాకు ఇద్దరు చిన్న పిల్లలు. ఇప్పుడు మా అమ్మ, అత్తగారింటి సాయంతో కుటుంబం నడుస్తున్నది. ఆర్థిక ఇబ్బందులున్నయ్‌. వితంతు పెన్షన్ అప్రూవ్ అయి తొమ్మిది నెలలైనా అకౌంట్‌లో డబ్బులు మాత్రం పడ్తలే. 

- రాథోడ్ జ్యోత్స్న, భీంపూర్, ఆదిలాబాద్