కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

 కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉంది: రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ వద్ద లక్షల కోట్ల రూపాయల దోపిడీ సొమ్ము ఉందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ఆయన.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భూదోపిడీకి పాల్పడ్డారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కర్ణాటకలోనూ వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సొమ్ముతో పార్టీలను కొనాలనుకుంటున్నారని, విపక్షాలకు ఇవ్వడానికి అన్ని కోట్లు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. 

 దేశంలోని రాజకీయాలను కార్పొరేట్ రాజకీయాలుగా చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సిద్ధాంతాలతో నడిచే రాజకీయ పార్టీలను ఎన్నికల నిర్వహణకు, ప్రజా ప్రతినిధుల కొనుగోళ్లకు నిధులు లేవని.. కాబట్టి మీకు కావల్సిన వేల కోట్ల రూపాయలను నేను సమకూరుస్తాను.. నన్ను నాయకుడిగా మీరు స్వీకరించండి అంటూ సీఎం కేసీఆర్.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో బేర సారాలు మొదలు పెట్టారన్నారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లోనూ కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెట్టారనే వార్తలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా వందలాది కోట్లు ఖర్చు పెట్టాలన్న ఆలోచన తప్ప, ప్రజాస్వామ్యా్న్ని కాపాడాలని లేదని ఆరోపించారు.