నా భర్త, పిల్లల్లో ఎవరి రక్తం బొట్టుపడ్డా దానికి కేసీఆరే బాధ్యుడు: జమున

నా భర్త, పిల్లల్లో ఎవరి రక్తం బొట్టుపడ్డా  దానికి కేసీఆరే బాధ్యుడు: జమున

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ అండతోనే.. ఈటల రాజేందర్ ను రూ.20 కోట్లు ఖర్చుపెట్టి చంపిస్తా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్తున్నారని ఈటల భార్య జమున ఆరోపించారు. చెప్పింది వినకపోతే చంపడానికి కూడా కేసీఆర్ రెడీ అవుతున్నారని అనుకోవాలా అని ప్రశ్నించారు. మంగళవారం శామీర్ పేటలోని తమ నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘మా ఇంట్లో నా భర్త, పిల్లలు.. ఎవరి రక్తం బొట్టు పడినా దానికి కేసీఆర్ దే బాధ్యత’ అని అన్నారు. మమ్మల్ని ఆర్థికంగా అనేక ఇబ్బందులు పెడుతున్నారు. చిన్న కులాల వారనే చిన్నచూపా అని ఆమె మండిపడ్డారు. ‘‘పిచ్చి కుక్కను ఎమ్మెల్సీ చేసి హుజూరాబాద్ ప్రజల మీదకు కేసీఆర్ వదిలిపెట్టారు.

ALSO READ:త్వరలో టీడీపీ బస్సు యాత్ర

మహిళలను కించ పరుస్తున్నడు. అమ్మ.. నాన్న సంస్కారం నేర్పారు అంటుండు. మరి కేసీఆరే.. కౌశిక్ కు ఈ పిచ్చి మాటలు నేర్పించారా.. గవర్నర్ ను తిడితే మందలించాల్సింది పోయి పదవులు ఇచ్చారు.. ఎన్ని మాట్లాడితే అన్ని ఎక్కువ పదవులు ఇస్తున్నారా” అని జమున ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా కొనసాగే నైతికత కౌశిక్ కు లేదు, ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈటల రాజేందర్ ఏ పార్టీలో ఉన్నా సంతృప్తిగానే ఉంటారని, ఆయన ప్రజలకోసం పనిచేస్తారని తెలిపారు. ‘‘మేం ఎప్పుడు పదవుల కోసం పాకులాడలేదు. కాళ్లు మొక్కుడు మా రక్తంలో లేదు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను. తెర వెనుక ఉంటూ ఈటల రాజేందర్ కు అండగా నిలుస్తా” అని తెలిపారు.