
- రాష్ట్రంపై కర్నాటక ఫలితాల ప్రభావం
- సైలెంట్ గా జేడీఎస్ కు మద్దతిచ్చిన బీఆర్ఎస్
- పోటీ నుంచి ఎంఐఎంను తప్పించినట్టు ప్రచారం
- నిన్నటి వరకు కేసీఆరే కింగ్ మేకరన్న గులాబీ నేతలు
- కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లురావడంతో సైలెంట్!
హైదరాబాద్: కర్నాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై తీవ్రంగా పడింది. హంగ్ ఏర్పడుతుందని, జేడీఎస్ మద్దతు కీలకం అవుతుందని, చివరి క్షణంలో కేసీఆర్ చక్రం తిప్పుతారంటూ నిన్నటి వరకు ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. జేడీఎస్ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచేలా సీఎం కేసీఆర్ సైలెంట్ గానే అనేక వ్యూహాలు రచించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా తమ మిత్రపక్షమైన ఎంఐఎం ఆ రాష్ట్రంలో పోటీ చేయకుండా ఆపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినా.. గులాబీ పార్టీ నేతలు మాత్రం హంగ్ ఏర్పడుతుందనే చెబుతూ వచ్చారు.
ఈవీఎంలు ఓపెన్ చేశాక సీన్ మారిపోయింది. ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దాని కన్నా ఎక్కువ సీట్లనే కాంగ్రెస్ గెలవడం, మ్యాజిక్ ఫిగర్ ను దాటి పోవడంతో కంగుతిన్నారు. బీఆర్ఎస్ మిత్రపక్షం జేడీఎస్ 20 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో37 సీట్లలో గెలిచిన జేడీఎస్ ఈసారి 17 స్థానాలకు కోల్పోవలసి వచ్చింది. కింగ్ మేకర్ గా మారి, దేశ రాజకీయాలను శాసించాలనుకున్న సీఎం కేసీఆర్ ఇప్పడు ఎలాంటి స్టెప్ తీసుకోబుతున్నారన్నది హాట్ టాపిక్ గా మారింది.