కేసీఆర్ కు లాస్ట్ చాన్స్!

కేసీఆర్ కు లాస్ట్ చాన్స్!
  •  సుప్రీంలో అనుకూల తీర్పు రాకుంటే పరేషానే!?
  •  పవర్ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే
  •  అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందే
  •  సీజేఐ బెంచ్ ఎలాంటి తీర్పు చెబుతుందో..?
  •  హాట్ టాపిక్ గా మారిన మాజీ సీఎం కేసు

హైదరాబాద్:  విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల ఏర్పాటులో జరిగిన అవకతవకలపై విచారణకు ఏర్పాటు చేసిన నర్సింహారెడ్డి కమిషన్ రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై జూలై 15 2024 నాడు విచారణ జరగనుంది. సీజేఐ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. కేసీఆర్ ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించగా కొట్టేసిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ సీఎం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లారు. కేసీఆర్ కు ఇదే చివరి అస్త్రం. ఒక వేళ సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వని పక్షంలో కేసీఆర్ నర్సింహారెడ్డి కమిషన్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ లీడర్ల చూపంతా ఇప్పుడు సుప్రీంకోర్టు వైపునకు మళ్లింది.

జడ్జినే తప్పుపట్టి హైకోర్టుకు

విచారణకు హాజరు కావాల్సిందిగా జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకాకపోగా జస్టిస్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ లేఖ రాశారు.  కమిషన్ కు చైర్మన్ గా ఉండే అర్హత మీకు లేదని, వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కమిషన్ రెండోసారి నోటీసులు జారీచేయడంతో హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.  లేఖలోని అంశాలనే తన పిటీషన్లో ప్రస్తావించిన కేసీయార్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దుచేయాలని కోరారు.

 విచారించిన హైకోర్టు కేసీయార్ ఆరోపణలన్నింటినీ కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక కేసీఆర్ సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై సీజేఐ నేతృత్వంలోని బెంచ్ కాసేపట్లో విచారణ చేపట్టనుంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థిస్తే.. కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కేసీఆర్ కు ఇది చివరి అవకాశంగా మారింది.