హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ సీటు ఎంఐఎంకు ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే చెప్పారు. తన పార్టీ బీఆర్ఎస్కు ఆ సీటును దక్కించుకునే మెజారిటీ ఓట్లు ఉన్నప్పటికీ మజ్లిస్కే వదిలేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేస్తామని, కనీసం15 మంది ఎమ్మెల్యేలం గెలిచి వస్తామని అసెంబ్లీ వేదికగా అధికార బీఆర్ఎస్ను ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరించినంత పని చేశారు. దీంతో బీఆర్ఎస్తో ఎంఐఎం దోస్తీ ముగిసినట్టేనని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీల సిగపట్లు తప్పవన్నట్టుగా ప్రచారం జరిగింది.
అసెంబ్లీ లాబీల్లోనూ.. వచ్చే ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేసి తీరుతామని అక్బర్ కుండబద్ధలు కొట్టారు. అయితే.. ఆ మధ్య అసెంబ్లీలోని మంత్రి కేటీఆర్ చాంబర్లో కేటీఆర్ను ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కలిసి.. హైదరాబాద్ లోకల్ బాడీస్ఎమ్మెల్సీ సీటుపై చర్చించారు. మిత్రధర్మంలో భాగంగా ఆ సీటును తమకే ఇచ్చేయాలని కోరారు. కేసీఆర్కు ఇదే విషయం చెప్పి ఒప్పిస్తానని ఆ మీటింగ్లో కేటీఆర్ హామీ ఇచ్చినట్టుగా తెలిసింది. అసద్తో చర్చల సారాంశాన్ని మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. ఇదే స్థానం నుంచి ఇప్పుడు ఎంఐఎం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న అమీనుల్ హసన్ జాఫ్రీకే మరోసారి చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. ఒకటి, రెండు రోజుల్లో ఆయన నామినేషన్ వేస్తారని సమాచారం. ఒకవేళ ఇతర పార్టీలు నామినేషన్ వేస్తే.. మార్చి 13న పోలింగ్ నిర్వహించి, 16న ఓట్లు లెక్కిస్తారు. కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్సీ పదవీకాలం మే నెల రెండో తేదీ నుంచి ప్రారంభమవుతుంది.