పంజాబీ సింగర్ సునంద శర్మ (Sunanda Sharma) శ్రోతలకు పరిచయం అక్కర్లేని పేరు. లేటెస్ట్గా ఆమెకు ఘాజియాబాద్లో జరిగిన ఒక లైవ్ మ్యూజిక్ కచేరీలో అనుకోని చేదు అనుభవం ఎదురైంది.
రాజ్ కుమార్ గోయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ఒక అభిమాని అకస్మాత్తుగా స్టేజ్పైకి ఎక్కి ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనతో సునందా ఒక్కసారిగా భయపడి స్టేజ్ను విడిచిపెట్టింది. వెంటనే భద్రతా సిబ్బంది స్పందించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు.
ఈ ఘటనపై సునందా శర్మ స్పందిస్తూ, ఆ అభిమానికి ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదని పేర్కొంది. అలాగే అతన్ని క్షమించాలని నిర్వాహకులను కోరుతూ, తాను కూడా అతన్ని క్షమించానని వెల్లడించింది.
ఘటన ఎలా జరిగింది?
ఫేమస్ పాటలైన “జట్ యమ్లా”, “జానీ తేరా నా”, “పాగల్ నహీ హోనా”తో ప్రసిద్ధి చెందిన సునందా శర్మ స్టేజ్పై ప్రేక్షకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా స్టేజ్పైకి ఎక్కాడు. ఆ వ్యక్తి ఆమె పాదాలను తాకడానికి ప్రయత్నించడంతో, ఆమె ఒక్కసారిగా భయపడి అరిచి వెంటనే స్టేజ్ దిగి వెళ్ళిపోయింది. దీంతో షో తక్షణమే రద్దు చేశారు. వెంటనే ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులు అతన్ని విచారించారు. అతను అదే కాలేజీకి చెందిన విద్యార్థి అని సమాచారం.
ఈ ఘటన తర్వాత ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే కొంతమంది ఆమె ప్రతిస్పందనను సమర్థించగా, మరికొందరు ప్రేక్షకుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా, ప్రేక్షకుల భద్రత, స్టేజ్ సెక్యూరిటీపై చర్చలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.
#SunandaSharma reacts in panic after a fan jumps on stage mid concert. pic.twitter.com/HFhI9BOuFN
— Filmfare (@filmfare) April 5, 2026
సునందా శర్మ రియాక్షన్
ఈ ఘటనపై సునందా శర్మ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. “ఇలాంటి అనుకోని ఘటనలకు, స్టేజీలపై ఉండే వాళ్ళు ఉలిక్కిపడే అవకాశం ఉంది. అందులో భాగంగానే నేను ఆ పరిస్థితికి షాక్ అయ్యాను. అందుకే నేను భయపడ్డాను. అయితే, ఆ వ్యక్తికి చెడు ఉద్దేశ్యం లేదని అనుకుంటున్నాను. మేనేజ్మెంట్ అతన్ని క్షమించాలని కోరుతున్నాను, నేను కూడా క్షమించాను. ఏదేమైనా.. కొన్నిసార్లు ప్రేమను వ్యక్తపరిచే విధానం తప్పుగా మారుతుంది ”అని సునందా మాట్లాడారు.
►ALSO READ | Trisha: ప్రతిదీ ప్రేమ కాదు.. అదీ లేకపోతే అన్నీ అర్థంలేనివే.. త్రిష ఇంట్రెస్టింగ్ పోస్టులు!
ఇకపోతే, సునందా శర్మ తన కెరీర్ను “Billi Akh” పాటతో ప్రారంభించింది. తర్వాత సజ్జన్ సింగ్ రంగ్రూట్ సినిమాలోదిల్జిత్ దోసాంజ్ తో కలిసి నటించింది. ప్రస్తుత వరుస సినిమాలో పాటలు పాడుతూ బిజీగా ఉంది.
