
‘‘ఇటీవల కొండపోచమ్మ ప్రాజెక్టుకు 5 వేల మందిని సీఎం కేసీఆర్ తీసుకపోయిండు. అక్కడ రూల్స్ పాటించలేదు. ఆ ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలే కానీ.. కరోనా మాత్రం వచ్చింది.అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యేలకు, అధికారులకు, పీఏలకు, జర్నలిస్టులకు, గన్మన్లకు సోకింది”అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా రావడంతో సీఎంకు సెగ తగిలి ఇప్పుడు టెస్టులు చేస్తామంటున్నారని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో కరోనా పరిస్థితిని చూసి కేంద్రం ఇన్వాల్స్ అయితదని, హెచ్చరించే ప్రమాదం ఉందని, హైదరాబాద్ను ఆధీనంలోకి తీసుకుంటుందని భయపడి కేసీఆర్ స్పందించిండు”అని అన్నారు. కరోనాపై మొదటి నుంచి కేసీఆర్ జోకులు వేయబట్టే రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చిందని, ఇన్ని కేసులు వస్తున్నాయని అన్నారు. బుధవారం జూమ్ యాప్ ద్వారా సంజయ్ మీడియాతో మాట్లాడారు. ‘‘బీజేపీ నుంచి అనేక సూచనలు ఇస్తున్నం. కరోనా అంశాన్ని రాజకీయ కోణంతో చూడొద్దని, పూర్తి సహకారం అందిస్తామని సీఎంకు చెప్పినం. లేఖ కూడా రాసినం. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమన్నం. వినకుండా ఒంటెత్తుపోకడతో ఏం చేసిన తానే చేయాలని సీఎం అనుకుంటున్నడు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. కరోనా ఎక్కడిది? పారాసిటమాల్ వేస్తే చాలు, అసెంబ్లీలో మాస్కులు , గ్లౌజులు పెట్టుకున్నమా? అని సీఎం ప్రశ్నించిండు. అప్పుడు ఆయన్ను పారాసిటమాల్ సీఎం అని అన్నరు. కరోనా ఫ్రీ తెలంగాణ చేస్తమన్నడు.. ఏమైంది? కరోనా పారిపోయిందని అన్నడు.. ఏడ పారిపోయింది? మొదటి నుంచి విచిత్రమైన ధోరణి, విచిత్ర మనిషి, విచిత్ర పాలన చేస్తండు. సీఎం జోకర్ గా మారిపోయిండు. కరోనా నీ చుట్టే తిరుగుతోంది. నీ ఎమ్మెల్యేలకు వచ్చింది”అని విమర్శించారు.