దేశంలోనే తొలి రాష్ట్రం
అధికార ఫ్రంట్కు కాంగ్రెస్ సపోర్ట్
వ్యతిరేకించిన ఒక్కగానొక్క బీజేపీ ఎమ్మెల్యే
తమిళనాడు కూడా తీర్మానం చేయాలన్న డీఎంకే
సిటిజన్ షిప్ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ మంగళవారం తీర్మానాన్ని ఆమోదించింది. సీఏఏను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ లో తీర్మానం చేసిన కేరళ దేశంలోనే తొలి రాష్ట్రం. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో సీఏఏను అమలుచేయబోమంటూ ప్రకటించాయి. అయితే లెజిస్లేచర్ మార్గాన్ని ఎంచుకుని సీఏఏను వ్యతిరేకించిన తొలి రాష్ట్రం మాత్రం కేరళనే. రాజకీయపరమైన భిన్నాభిప్రాయాలను పక్కనపెట్టి అధికార సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్డీఎఫ్కి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష యూడీఎఫ్ తీర్మానానికి సపోర్ట్చేసింది. మంగళవారం జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 140 మంది సభ్యులున్న సభలో బీజేపీ ఒక్కగానొక్క ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి ఒ.రాజగోపాల్ మాత్రమే తీర్మానాన్ని వ్యతిరేకించారు.ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టగా, ప్రతిపక్ష నాయకుడు రమేశ్ చెన్నితల దానికి సపోర్ట్చేశారు. సీఎం ఈ సందర్భంగా మాట్లాడుతూ..సెక్యులర్ భావాలకు, దేశంలో భిన్న సంస్కృతులకు సీఏఏ వ్యతిరేకమని చెప్పారు. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం దారుణమన్నారు. దేశప్రజల్లో నెలకొన్న భయాందోళనల నేపథ్యంలో సీఏఏ రద్దుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని, రాజ్యాంగంలో పొందుపరిచిన సెక్యులర్సూత్రాలను కొనసాగించాలని ముఖ్యమంత్రి కోరారు.
రాష్ట్రంలో డిటెన్షన్ సెంటర్ పెట్టం
కేరళలో ఒక్క డిటెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేయబోమని విజయన్ ఈసందర్భంగా సభ్యులకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితల మాట్లాడుతూ సీఏఏను గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సపోర్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. రాజకీయాలకు గవర్నర్ అతీతంగా ఉండాలని కోరారు. అంతకుముందు సెషన్ ప్రారంభం కాగానే బిల్లును వ్యతిరేకిస్తూ రాజగోపాల్ మాట్లాడారు. సీఏఏ చట్టాన్ని లోక్సభ, రాజ్యసభలు రెండూ ఆమోదించినందున.. మళ్లీ దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం అన్యాయమని అన్నారు. అసెంబ్లీ, లోక్సభలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు మరో పదేళ్లపాటు పొడిగించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఆమోదం తెలిపేందుకు కేరళ అసెంబ్లీ మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైంది. అయితే సీఏఏకు వ్యతిరేకంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందువల్ల .. దానిపైనా ఎమ్మెల్యేల అభిప్రాయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ తీర్మానం సభలో ప్రవేశపెట్టినట్టు అధికార వర్గాలు చెప్పాయి.
స్వాగతించిన డీఎంకే
సీఏఏను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని డీఎంకే స్వాగతించింది. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు తమిళనాడు అసెంబ్లీలోనూ ఇదే మాదిరి తీర్మానం చేయాలని డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ మంగళవారం డిమాండ్చేశారు. వచ్చే ఏడాది జనవరి 6న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ఈమేరకు తీర్మానం ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆయన కోరారు. పార్లమెంట్లో సీఏఏకు ఏఐఏడీఎంకే మద్దతు
తెలిపింది.
ఏ రాష్ట్రానికి ఆ పవర్ లేదు
సిటిజన్షిప్ కు సంబంధించిన ఏదయినా చట్టం ఆమోదించే అధికారం పార్లమెంట్ కు మాత్రమే ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేరళతో సహా ఏ రాష్ట్ర అసెంబ్లీకి సిటిజన్ షిప్ పై చట్టాలు చేసే అధికారం లేదని చెప్పారు. మంగళవారం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు(సీఏఏ)ను రద్దు చేయాలని కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే రవిశంకర్ ప్రెస్ మీట్లో ఈ కామెంట్ చేశారు. సీఏఏ ఇండియన్సిటిజన్స్ కు సంబంధం లేనిదని, అది సిటిజన్షిప్ను సృష్టించడం గాని, తొలగించడం గాని చేయదని అన్నారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్గాంధీలు వరుసగా ఉగాండా, శ్రీలంక కు చెందిన మైనార్టీలకు సిటిజన్షిప్ కల్పించారని ఆయన గుర్తుచేస్తూ అదే పని ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్షా చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సీఏఏ పూర్తిగా చట్టబద్ధం, రాజ్యాంగ బద్ధమైనదని, స్వార్థ ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.