వయనాడ్: కేరళలోని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నియోజకవర్గం వయనాడ్ లో త్వరలో స్థానిక ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి కల్పెట్ట మున్సిపాలిటీలోని హరితగిరి రెసిడెంట్స్ అసోషియేషన్ ఓటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రాంతంలో తమను ఇబ్బందులు పెడుతున్న కోతుల బెడదకు ఎవరైతే శాశ్వత పరిష్కారం చూపిస్తారో, వారికే ఓటేస్తామని అంటున్నారు. లేదంటే ఓటేసేది లేదని చెబుతున్నారు. ఈ మేరకు తమ ఏరియాలో పోస్టర్లు కూడా వేయించారు.
కోతులతో తాము గత కొన్నేండ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎవరికి చెప్పుకున్నా తమ మొరను ఆలకించలేదని హరితగిరి వాసులు చెప్పారు. ఏటికేడు కోతుల బెడద మరింత పెరుగుతున్నదన్నారు. కోతులు పెంకులు తొలగించి ఇండ్లలో చొరబడుతున్నాయని, నిల్వ ఉంచిన ధాన్యాన్ని, వండుకున్న వంటలను అవి లూటీ చేస్తున్నాయని తెలిపారు. అందుకే ఈసారి తమ సమస్యను పరిష్కరించే వారికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు.