కట్నం వేధింపులు.. బాత్రూంలో శవమైన మెడికల్ స్టూడెంట్

కట్నం వేధింపులు.. బాత్రూంలో శవమైన మెడికల్ స్టూడెంట్
  • కేరళలో మెడికల్ స్టూడెంట్ మిస్టరీ డెత్
  • వేధింపుల ఫోటోలను పుట్టింటికి వాట్సాప్ చేసిన మృతురాలు
  • తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం

కేరళలో దారుణ ఘటన జరిగింది. కట్నం కోసం భర్త చేసిన వేధింపుల ఫోటోలను తన కుటుంబంతో పంచుకున్న 24 ఏళ్ల యువతి బాత్‌రూంలో శవమై తేలింది. ఈ ఘటన కేరళ ప్రభుత్వాన్ని సైతం కదిలించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం పినరయి విజయన్ అధికారులను ఆదేశించారు. 

తిరువనంతపురానికి చెందిన విస్మయ నాయర్ (24), కొల్లాంకి చెందిన కిరణ్ కుమార్‌(30)ల వివాహం గత సంవత్సరం జూన్‌లో జరిగింది. విస్మయ నాయర్ మెడిసిన్ చదువుతుండగా.. కిరణ్ కుమార్ రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరి వివాహ సమయంలో కిరణ్ కుమార్‌కు కట్నంగా 100 గోల్డ్ కాయిన్లు, ఎకరం భూమి, రూ. 10 లక్షల విలువైన కారు ఇచ్చారు. పెళ్లైన కొన్నాళ్ల పాటు వీరి వివాహబంధం సజావుగానే సాగింది. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఇంకా అదనపు కట్నం కావాలంటూ కిరణ్.. విస్మయను వేధించడం మొదలుపెట్టాడు. గత జనవరిలో ఓ రోజు రాత్రి దంపతుల మధ్య పెద్ద గొడవ జరిగింది. దాంతో విస్మయ అదే రాత్రి తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిన కిరణ్.. విస్మయను ఆమె తల్లిదండ్రుల ముందే కొట్టాడు. దాంతో ఎంతో బాధపడిన విస్మయ తండ్రి త్రివిక్రమన్ నాయర్.. కూతురిని తమ ఇంట్లోనే ఉంచుకున్నాడు. విస్మయ కూడా అక్కడి నుంచే కాలేజీకి వెళ్లి వచ్చేది.

ఈ క్రమంలో మార్చి 17న తన బర్త్‌డే సందర్భంగా కిరణ్.. విస్మయ కాలేజీకి వెళ్లి ఆమెను బతిమిలాడి తన వెంట కొల్లాం తీసుకెళ్లాడు. అప్పటి నుంచి కొంతకాలం ఇద్దరూ మంచిగానే ఉన్నారు. కాగా.. విస్మయ అత్తింటికి వెళ్లిన తర్వాత తండ్రితో మాట్లాడటం మానేసింది. కేవలం తల్లితో మాత్రమే మాట్లాడేది. ఇదిలా ఉండగా.. తనకిచ్చిన కారును అమ్మి.. తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా కిరణ్ మళ్లీ విస్మయను వేధించసాగాడు. విస్మయను విపరీతంగా కొట్టడంతో.. ఆమె తన గాయాలన్నింటిని పుట్టింటికి వారికి వాట్సాప్‌లో పంపింది. ఇది జరిగిన రెండు రోజులకే విస్మయ కొల్లాంలోని తన భర్త ఇంట్లోని బాత్‌రూంలో ఉరివేసుకొని చనిపోయింది. 

నా కూతురుని నమ్మించి తీసుకెళ్లి హత్యచేశాడు

తన కూతురుని కిరణ్ అదనపు కట్నం కోసం హత్యచేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని విస్మయ తండ్రి త్రివిక్రమన్ ఆరోపిస్తున్నాడు. ‘పెళ్లి సమయంలో ముందు అనుకున్న ప్రకారం అప్పగింతలన్నీ చేశాం. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం కోసం నా కూతురుని వేధించడం ప్రారంభించాడు. గొడవలతో విసిగి పుట్టింటికి వచ్చిన నా కూతురుని.. నమ్మించి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ వేధించడంతో పాటు తీవ్రంగా కొట్టాడు. ఆ గాయాలన్నింటిని మాకు వాట్సాప్ చేసిందని.. కోపంతో ఆమెను చంపేశాడు. కిరణ్‌ని కఠినంగా శిక్షించాలి’ అని విస్మయ తండ్రి వాపోతున్నారు.

తీవ్రంగా స్పందించిన సీఎం.. అపరాజిత సర్వీసు ప్రారంభం

విస్మయ కథ ప్రస్తుతం కేరళ మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో ప్రసారం కావడంతో.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా తీవ్రంగా స్పందించారు. ఈ కాలంలో కూడా కట్నం కోసం వేధించడం దారుణమని ఆయన అన్నారు. ఇలాంటి అనాగరిక వరకట్న వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన అన్నారు.

‘ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. వివాహం అనేది కుటుంబం యొక్క సామాజిక స్థితి మరియు స్టేటస్‌కు సంబంధించినది కాకూడదు. ఈ అనాగరిక వరకట్న విధానం మన కుమార్తెలను ఒక సరుకుగా దిగజార్చుతుందని తల్లిదండ్రులు గ్రహించాలి. మనం ఆడపిల్లలను మంచిగా చూసుకోవాలి. వారిని మనుషులుగా గుర్తించాలి. మహిళలపై జరుగుతున్న దాడులు మరియు వరకట్న వేధింపులను ఫిర్యాదు చేయడానికి ఈ రోజే ‘అపరాజిత’ అనే ఆన్‌లైన్ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఎవరికైనా వేధింపులుంటే.. వెంటనే aparajitha.pol@kerala.gov.in లేదా 9497996992 నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు’ అని సీఎం ట్వీట్ చేశారు.

కొల్లంలో జరిగిన సంఘటన చాలా బాధాకరమైనదని.. ఇది కేరళ ప్రజల మనస్సాక్షికి షాక్ ఇచ్చిందని కేరళ పోలీసు చీఫ్ లోక్‌నాథ్ బెహెరా అన్నారు. ‘నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఈ ఘటనతో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉంటే వారిపై కూడా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తాం’ అని ఆయన అన్నారు.