హైదరాబాద్,వెలుగు : ఖైరతాబాద్ సెగ్మెంట్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత పల్లపు గోవర్ధన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించే ఆయన ఖైరతాబాద్ టికెట్ ఆశించారు. ఖైరతాబాద్ టికెట్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి కేటాయించడంతో గోవర్ధన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. వడ్డెర సామాజిక వర్గానికి చెందిన బలమైన బీసీ నేతగా గోవర్ధన్ పేరు పొందారు.
గురువారం బీజేపీకి రాజీనామా చేసిన ఆయనను మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. శుక్రవారం భారీ ర్యాలీతో వెళ్లి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నట్టు పల్లపు గోవర్ధన్ తెలిపారు. ఆయన అనుచరులు సైతం గులాబీ పార్టీలో చేరనున్నారు. ఎన్నికల్లో నాలుగైదు సీట్లు గెలిచేందుకే బీసీ సీఎం నినాదంతో బలహీన వర్గాలను బీజేపీ మోసం చేస్తుందని గోవర్దన్ ఆరోపించారు.