ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో టికెట్ల లొల్లి
  • ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నియోజకవర్గాల్లో దడ పుట్టిస్తున్న అసమ్మతి నేతలు
  • ‘గడపగడపకు గడల’ పేరుతో ఇంటింటి ప్రచారానికి గడల శ్రీకారం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  బీఆర్ఎస్​ ఫస్ట్​ లిస్టు సోమవారం విడుదలవుతుందనే వార్తలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సిట్టింగు ఎమ్మెల్యేల్లో దడ పుట్టిస్తున్నాయి. లిస్టుల్లో తమ పేర్లు ఉంటాయో లేదో అనే ఆందోళనలో ఉన్న ఇల్లెందు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు హైదరాబాద్​కు మకాం మార్చారు. హరీశ్​రావు లాంటి కీలక నేతల సాయంతో  సిట్టింగులు టికెట్​ కన్ఫర్మ్​చేసుకునే పనిలో ఉండగా, అసమ్మతి నేతలు కూడా తమ వంతు లాబీయింగ్​ చేస్తున్నారు. టికెట్​ నాదంటే నాదని ప్రచారం చేసుకోవడంతో పాటు కొత్తగూడెంలో స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాస్​రావు ఏకంగా ‘గడపగడపకు గడల’ పేరుతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి రేపుతోంది.

సిట్టింగుల్లో ఆందోళన..

ఇల్లెందులో బీఆర్ఎస్​ సిట్టింగ్​ ఎమ్మెల్యే  బానోత్​ హరిప్రియకు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన మున్సిపల్​ చైర్మన్​ డి. వెంకటేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలువురు నేతలు అసమ్మతికి తెరలేపారు. టికెట్​ ఇస్తే పార్టీకి నష్టమని బహిరంగంగా పేర్కొంటున్నారు. కొత్తగూడెంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, స్టేట్​ హెల్త్​ డైరెక్టర్​ గడల శ్రీనివాస్​ ఎవరికి వారు టికెట్​ తనకే అంటూ ప్రకటించుకుంటున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరి తిరిగి సొంత గూటికి చేరిన తెల్లం వెంకట్రావ్​కు టికెట్​ ఇవ్వవద్దని ప్రభుత్వ విప్​ రేగా కాంతారావును వాజేడు మార్కెట్​ కమిటీ చైర్మన్​ బుచ్చయ్య కలిశారు. 

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా అసమ్మతి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇల్లెందులో అసమ్మతి నేతలకు ఎమ్మెల్సీలు తాతా మధు, పల్లా రాజేశ్వర్​రెడ్డితో పాటు మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ మద్దతు ఉందనే ప్రచారం ఉంది. కొత్తగూడెంలో గడల శ్రీనివాసరావుకు మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు మద్ధతు ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెబుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు అసిస్టెంట్​ ప్రొఫెసర్​ గుమ్మడి అనురాధను అసమ్మతి నేతలు క్యాండిడేట్​గా బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కొత్తగూడెం, ఇల్లెందు సీట్ల వ్యవహారం జిల్లాలో హాట్​ టాపిక్​గా మారింది. 

రాజధానికి చేరిన సీట్ల లొల్లి..

ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియకు వ్యతిరేకంగా ఇల్లెందు మున్సిపల్​ చైర్మన్​ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నేతలు అసమ్మతి గళం విప్పారు. ఇల్లెందులో గెలవాలంటే కొత్త వ్యక్తులు రావాలని పరోక్షంగా అనురాధ పేరును ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యే భర్త హరిసింగ్​ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీకి నష్టం జరుగుతోందని, తనపై అవిశ్వాసానికి కౌన్సిలర్లలో విభేదాలు సృష్టించారని ఆరోపించారు. 

ఈ క్రమంలో హరిప్రియ అనుచరులు ఎమ్మెల్సీ తాతా మధు అసమ్మతిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇల్లెందులో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మున్సిపల్​ కౌన్సిలర్లతో కలిసి ఆదివారం హుటాహుటిన హైదరాబాద్​ వెళ్లారు. సీఎం, మంత్రి కేటీఆర్​ అందుబాటులో లేకపోవడంతో మంత్రి హరీశ్​రావును కలిసి ఇక్కడి పరిస్థితి వివరించారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కూతురు గుమ్మడి అనురాధను బరిలోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగూడెం సీటు తమదంటే తమదని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో పాటు గడల శ్రీనివాసరావు హైదరాబాద్​కు చేరుకున్నారు.

భద్రాచలంలోనూ అదే సీన్..

భద్రాచలం నియోజకవర్గంలో సీనియర్​ నేతగా ఉన్న తెల్లం వెంకట్రావ్​ ఇటీవల మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డితో కలిసి కాంగ్రెస్​లో  చేరారు. నాలుగు రోజుల కింద కాంగ్రెస్​ను వీడి తిరిగి బీఆర్​ఎస్​లో చేరారు. సీపీఎంతో పొత్తులు లేకపోతే టికెట్​ తెల్లం వెంకట్రావ్​కే నంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వాజేడు మార్కెట్​ కమిటీ చైర్మన్​ బుచ్చయ్య రంగంలోకి దిగారు. ప్రభుత్వ విప్​ రేగా కాంతారావును కలిసి తనకే టికెట్​ ఇప్పించాలని కోరారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా చాప కింద నీరులా పలువురు నేతలు అసమ్మతికి ఆజ్యం పోస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు దడ పుట్టిస్తున్నారు. 

సీఎంను కలిసిన వెంకట్రావ్​ దంపతులు

ఇటీవల కాంగ్రెస్ నుంచి తిరిగి బీఆర్ఎస్​లో చేరిన తెల్లం వెంకట్రావు దంపతులు ఆదివారం ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభ్యర్థుల లిస్ట్​ ప్రకటిస్తున్న నేపథ్యంలో సీఎంను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాగ్రత్తగా పనిచేసుకో అంటూ కేసీఆర్​ భరోసా ఇచ్చినట్లుగా వెంకట్రావ్​ వర్గీయులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తొలి జాబితాలో భద్రాచలం అభ్యర్థిగా వెంకట్రావ్​ పేరును సీఎం కేసీఆర్​ ప్రకటించారు. 

ఆ ఎన్నికలో వెంకట్రావ్​ ఓడిపోయినా, పార్టీ అధికారంలోకి పార్టీ వచ్చింది. మళ్లీ ఇదే సెంటిమెంట్​ను ఫాలో అవ్వాలని వెంకట్రావ్​కు హామీ ఇచ్చారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్​ రేగా కాంతారావుతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి నుంచి అండదండలు ఉండడం కలిసి వస్తుందని చెబుతున్నారు.