- రాహుల్ గాంధీ వల్ల దేశానికి ఏం ప్రయోజనం లేదు
- 2025లో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయితే రేవంత్ ఎందుకు రాజీనామా చేయలే?
- కేసీఆర్ సర్కారు వల్లనే రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ కేంద్రంగా గత రెండు రోజులుగా రాజకీయ ప్రేరేపిత ధర్నాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని, దేశ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో ఆయన నివాసంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల బృందం భేటీ అయింది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో పాటు ఎంపీలు రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో కిషన్రెడ్డి మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ అయినప్పుడు వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. 17 మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టిందని తెలిపారు. రెండోసారి సమర్థవంతంగా పరీక్ష నిర్వహించిందని తెలిపారు. కొందరు ఉపాధ్యాయులు స్వార్థం, అవినీతితో పేపర్ లీక్ చేశారని పేర్కొన్నారు. రాజకీయ అస్థిత్వం కోసం కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు విద్యార్థులను అడ్డుపెట్టుకుని ఇలా అరాచకం చేయడం సరికాదన్నారు.
రాహుల్గాంధీ ఓ అసమర్థ నాయకుడని.. ఆయన వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. విద్యార్థులను ఎగదోసి దేశ శాంతిభద్రతకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందన్నారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీకులు జరిగినా రాజీనామా చేయని వ్యక్తులు ఇవ్వాళ బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలని అడగటం హస్యాస్పదమని అన్నారు. మేము రాజీనామా చేయాలని అడిగే కనీసం నైతిక హక్కు రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి లేదన్నారు.
2025లో సీఎం రేవంత్ ఎందుకు రిజైన్ చేయలే?
రాష్ట్రంలో 2025లో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ అయినప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. టీచర్లను మాత్రమే సస్పెండ్ చేశారని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. 2026లో వ్యవసాయ వర్సిటీ, జగిత్యాలలో బీఎస్సీ పేపర్ లీక్ అయ్యిందని పేర్కొన్నారు. అప్పుడు కాంగ్రెస్ మంత్రులతో రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. ‘రాజస్తాన్లో అశోక్ గెహ్లాట్ హయాంలో 18 పేపర్లు లీక్ అయ్యాయి. అప్పుడు ప్రియాంక గాంధీ ఎందుకు మాట్లాడలేదు.
కాంగ్రెస్దే లీకుల చరిత్ర. బీఆర్ఎస్ హయాంలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు మీరు ఎక్కడకు పోయారు’ అని ఆయన మండిపడ్డారు. ఎవరెవరి ప్రభుత్వ హయాంలో ఎన్ని రకాల ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయో తెలుసుకోవాలని, అప్పుడు ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారో? ప్రజలకు సమాధానం చెప్పి బీజేపీని విమర్శించాలని కిషన్ రెడ్డి హితవు పలికారు.
ఎన్డీఎస్ఏ పేరిట కేంద్రాన్ని బద్నాం చేస్తున్నరు: రఘునందన్ రావు
రాష్ట్రంలో రైతులకు నీళ్లు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే పట్టించుకోవటం లేదని రఘునందన్ రావు మండిపడ్డారు. నీళ్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు కలిసి డ్రామాలు ఆడుతూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆయన ఫైర్అయ్యారు. “కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడు. ఎన్డీఎస్ఏకు ముందు ఎస్డీఎస్ఓ నుంచి ఏదైనా నివేదిక తెప్పించుకున్నారా? ఎన్డీఎస్ఏ పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ సర్టిఫికెట్ ఇవ్వదు..
ఎందుకంటే ఎన్డీఎస్ఏ నుంచి ముందస్తు అనుమతులు తీసుకోలేదు. అనుమతులు లేకుండానే కాళేశ్వరాన్ని నిర్మించి.. ఇప్పుడు కేంద్రంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. లక్ష కోట్ల అవినీతి గురించి సీబీఐకి ఎంక్వైరీ కోసం పంపండి.. అప్పుడు పూర్తి నివేదిక ఇస్తం”అని పేర్కొన్నారు. దేశ భద్రతను వ్యతిరేకించే వారంతా కలిసి సీజేపీని ఏర్పాటు చేశారని, వాళ్లంతా సంఘవిద్రోహ శక్తులేనని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో పేపర్ లీకులు జరిగాయని.. ఏ మంత్రి అయినా రాజీనామా చేశారా? అని ఆయన ప్రశ్నించారు. నీట్ పేపర్ల లీక్పై దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నాయన్నారు.
