- కాళేశ్వరం లోపాలపైకేసీఆర్ ముక్కు నేలకు రాయాలి
- సీబీఐ ఎంక్వైరీకి ఒప్పుకోవాలి: కిషన్రెడ్డి
- కుంగిన మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన
- బ్యారేజీ రెండున్నర మీటర్లు కుంగినా నోరు మెదపరా?
- అక్కడ ఒక్క టీఎంసీ కూడా నిల్వ చేసే పరిస్థితి లేదు
- నిర్మాణం సరిగ్గా లేదని ఇంజినీర్లు చెప్పినా..కేసీఆర్ లెక్క చేయలేదు..
- 80 వేల బుక్స్ చదివిన అతితెలివి చూపిస్తున్నరని ఫైర్
జయశంకర్ భూపాలపల్లి/ మహాదేవ్పూర్, వెలుగు: కాళేశ్వరం ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, దాని పేరిట తెలంగాణ ప్రజల లక్ష కోట్ల రూపాయల సొమ్మును కేసీఆర్ గోదారి పాల్జేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు. ‘‘ఇంజినీర్లు, మేధావుల నోరు మూయించి కేసీఆర్ కట్టిన ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. ఇది రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారింది. 80 వేల పుస్తకాలు చదివిన అతితెలివి, దురహంకారం, ఏకపక్ష నిర్ణయం కారణంగా ప్రజల సొమ్ము గోదారి పాలైంది” అని అన్నారు. కేసీఆర్ ముక్కు నేలకు రాసి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులను ఒప్పుకోవాలని, సీఎం కుర్చీ దిగి సీబీఐ ఎంక్వైరీకి అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని కిషన్రెడ్డి శనివారం పరిశీలించారు.
ఆయన వెంట ఎంపీ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రఘునందన్రావు, ఈటల రాజేందర్ తదితరులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్న కిషన్రెడ్డి నేరుగా బ్యారేజీపైకి వెళ్లారు. అక్కడే ఉన్న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు.. బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని కిషన్ రెడ్డి బృందానికి చూపించారు. పిల్లర్లు కుంగిపోవడానికి కారణాలను వివరించారు. బ్యారేజీ 7వ బ్లాక్లో కుంగిన 20, 21, 19వ పిల్లర్లను పరిశీలించారు.
పిల్లర్లపై వచ్చిన పగుళ్లను తన సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీశారు. వంతెనపై కుంగిన రోడ్డును పరిశీలించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును బ్యాంకుల్లో కుదవపెట్టి, లక్ష కోట్లు అప్పు చేసి నాసిరకం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇరిగేషన్ ఇంజినీర్లు ప్రాజెక్ట్ నిర్మాణం శాస్త్రీయ పద్ధతిలో లేదని ఆందోళన వ్యక్తం చేసినా కేసీఆర్ పట్టించుకోలేదని అన్నారు. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ ఆర్భాటం చేసిన్రు. కోట్లు గుమ్మరించి డిస్కవరీ చానల్లో కాళేశ్వరం గురించి ప్రచారం చేయించుకున్నరు. బ్యారేజీ కుంగడం, పంప్హౌస్లు మునగడంతో కాళేశ్వరం భవిష్యత్తు అంధకారంగా మారింది” అని ఆయన అన్నారు.
పిల్లర్లకు పగుళ్లు వచ్చినయ్
గత నెల 21న రాత్రి మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన విషయం తెలియగానే తాను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు చెప్పానని, ఆయన వెంటనే స్పందించి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీమ్ను ఎంక్వైరీ కోసం పంపారని కిషన్రెడ్డి తెలిపారు. ఆరుగురు సభ్యులతో కూడిన ఈ టీమ్ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో మాట్లాడి శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక పంపించిందని వివరించారు. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని తాను కండ్లారా చూశానని తెలిపారు. ‘‘రెండున్నర మీటర్ల లోతు కుంగిపోవడం వల్ల బ్రిడ్జిపై ఉన్న రోడ్డు ప్రమాదకరంగా ఉంది. ఇంజినీరింగ్ వ్యవస్థ, క్వాలిటీ, మెయింటెనెన్స్ లోపం వల్లనే ఇది జరిగింది. కుంగిపోయిన పిల్లర్లతో పాటు ఇతర పిల్లర్ల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది” అని అన్నారు.
ఒక్క టీఎంసీ కూడా నిల్వ చేయలేం
మేడిగడ్డలో ప్రస్తుతం ఒక్క టీఎంసీ కూడా నిల్వ చేసుకునే పరిస్థితి లేదని కిషన్రెడ్డి అన్నారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.40 వేల కోట్లు అంచనా వేసి.. ఆ తర్వాత రూ.1.30 లక్షల కోట్లకు పెంచారు. కానీ, ఇప్పుడు అదే ప్రాజెక్ట్ మట్టికొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదు. ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజలపై విశ్వాసం ఉంటే.. తెలంగాణ బాగుపడాలని కోరుకుంటే సీబీఐ దర్యాప్తుకు అంగీకరించాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి” అని డిమాండ్ చేశారు. అన్నారం బ్యారేజీ పరిస్థితి కూడా మేడిగడ్డ మాదిరిగానే తయారైందని కిషన్రెడ్డి అన్నారు. అక్కడ బ్యారేజీ పిల్లర్ల కింద నుంచి వాటర్ లీక్ అవుతున్నదని తెలిపారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్ట్ అంటూ ఆర్భాటం చేసిన్రు. కోట్లు గుమ్మరించి డిస్కవరీ చానల్లో కాళేశ్వరం గురించి ప్రచారం చేయించుకున్నరు. బ్యారేజీ కుంగడం, పంప్హౌస్లు మునగడంతో కాళేశ్వరం భవిష్యత్తు అంధకారంగా మారింది.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి