ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) చందాదారులకు తీపి కబురు అందిస్తూ, ఈ ఏడాది కూడా వడ్డీ రేటును 8.25% వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. ఈరోజు (మార్చ్ 2) జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది (2024-25) ఎంత వడ్డీ ఇచ్చారో, ఈ ఏడాది (2025-26) కూడా అంతే వడ్డీ ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా పీఎఫ్ అకౌంట్ ఉన్న సుమారు 7 కోట్ల మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. EPFO తీసుకున్న ఈ నిర్ణయానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే, వడ్డీ డబ్బులు నేరుగా ఉద్యోగుల PF అకౌంట్లో జమ అవుతాయి.
గత 15 ఏళ్లలో పీఎఫ్ వడ్డీ రేట్లు చూస్తే :
2026లో - 8.25%, 2025లో - 8.25%, 2024లో - 8.25%, 2023లో - 8.15%, 2022లో - 8.10 %, 2021లో - 8.5 %, 2020లో - 8.5%, 2019లో - 8.65 %, 2018లో - 8.55%, 2017లో - 8.65%, 2016లో - 8.8%, 2015లో - 8.75%, 2014లో - 8.75%, 2013లో - 8.5%, 2012లో - 8.25%.
నాలుగేళ్ల క్రితం అంటే 2021-22లో పీఎఫ్ వడ్డీ రేటు 8.1%కి పడిపోయింది. ఈ వడ్డీ రేటు గత 40 ఏళ్లలో అత్యల్పం. ఆ తర్వాత నిరసనలు రావడంతో ప్రభుత్వం కొద్దిగా పెంచి, గత మూడు ఏళ్లుగా 8.25% వద్దే నిలకడగా ఉంచుతోంది. ప్రస్తుత ధరల పెరుగుదల అంటే ద్రవ్యోల్బణం దృష్ట్యా వడ్డీ రేటు పెంచాలని ఉద్యోగులు కోరుకున్నప్పటికీ, ప్రభుత్వం పాత రేటునే కొనసాగించాలని నిర్ణయించింది. EPFO డేటా ప్రకారం, ప్రస్తుతం దేశంలో ఏడు కోట్లకు పైగా PF చందాదారులు ఉన్నారు.
