
- ఆర్టికల్ 371 వల్ల 42 వేల మంది మృతి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- బీజేపీ స్టేట్ఆఫీసులో శ్యామాప్రసాద్ముఖర్జీకి నివాళి
హైదరాబాద్, వెలుగు: జమ్మూ కశ్మీర్ పై నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు దూరదృష్టి లేదని, అనాలోచిత విధానాలతో కశ్మీర్ సమస్యకు కారణమయ్యారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్మృతి దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్ పై తీసుకుంటున్న నిర్ణయాలతో భవిష్యత్తులో నష్టం జరుగుతుందని నెహ్రూకు శ్యామా ప్రసాద్ ముఖర్జీ చెప్పినా వినలేదన్నారు.
ఆనాడు జమ్మూ కశ్మీర్ వెళ్లాలంటే ప్రత్యేకమైన అనుమతి తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ అడుగుపెట్టారని, అనుమతి లేకుండా వెళ్లినందుకు అరెస్ట్ చేశారు. అయితే అక్కడ ఆయన అనుమానాస్పదంగా మరణించారన్నారు. ఏ లక్ష్యం కోసం ఆయన ప్రాణాలర్పించారో ఆ 371 ఆర్టికల్ ను తొలగించి ప్రధాని మోదీ.. ముఖర్జీ ఆశయాన్ని నెరవేర్చారన్నారు. ఈ ఆర్టికల్ తో 42వేల మంది చనిపోయారని, అయినా కాంగ్రెస్ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని చెప్పారు. సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు బీబీపాటిల్, ప్రేమేందర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ తో భేటీ
ఎంసీఆర్ హెచ్ఆర్డీలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ)తో కిషన్ రెడ్డి మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 2014లో రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల బ్రాంచులు ఆరు వేలు ఉండగా ప్రస్తుతం కొత్తగా మరో 600 బ్రాంచులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్ వ్యవస్థ సైతం బలపడిందన్నారు.