సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజల పట్ల శాపంగా మారిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. కేసీఆర్ ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని.. ప్రజల పోరాటం వల్లే వచ్చిందని చెప్పారు. మిలియన్ మార్చ్ స్ఫూర్తితో మార్చి 10న తెలంగాణ బచావో సదస్సు నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బచావో సదస్సు పోస్టర్ను కోదండరాం రిలీజ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారులంతా ఈ సదస్సులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమకారుల నుంచి వచ్చిన సలహాలు, సూచనలతో భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామన్నారు.
భూ ఆక్రమణలతో కేసీఆర్ కుటుంబం ఆస్తులు పెంచుకుంటోందని కోదండరాం విమర్శించారు. బీఆర్ఎస్ నేతల భూ ఆక్రమణలకు ధరణి ఉపయోగపడుతుందని ఆరోపించారు. కేసీఆర్ రెండు ముఖాలతో వ్యవహరిస్తున్నారని కోదండరాం మండిపడ్డారు. ఢిల్లీలో అత్యంత ప్రజాస్వామ్య వాదిగా.. తెలంగాణలో నియంతృత్వ వాదిగా వ్యవహరిస్తున్నారని కోదండరాం వ్యాఖ్యానించారు.