మహేశ్వర్ రెడ్డి .. భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరికి రా.. ప్రమాణం చేద్దాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మహేశ్వర్ రెడ్డి ..  భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరికి రా.. ప్రమాణం చేద్దాం :  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తనపై  బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మొన్నటిదాక అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతానని..  సహాయం చేయమని అడిగిన మహేశ్వర్ రెడ్డి.. ఇప్పుడు తనపై లేనిపోని అబద్దాలు మాట్లాడుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అమిత్ షాలను  మహేశ్వర్ రెడ్డి భాగ్యలక్ష్మీ టెంపుల్ దగ్గరికి తీసుకుని రావాలని అక్కడే అందరం ప్రమాణం చేద్దామని మంత్రి సవాల్ విసిరారు. 

ఐదేండ్లకో పార్టీ మారే మహేశ్వర్ రెడ్డి.. రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి జెండా మార్చని తనపై విమర్శలు చేస్తాడా అని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. దేశంలో పార్టీ చేరికల కమిటీ పెట్టిన దిగజారుడు పార్టీ బీజేపీనే అని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రపంచంలో ఎక్కడ లేనట్టు.. చేరికల కమిటీకి ఛైర్మన్ ను కూడా నియమించారని.. అయినప్పటికీ  ఒక్క కార్పోరేటర్ కూడా ఆ పార్టీలో చేరలేదన్నారు. 

మహేశ్వర్ రెడ్డి రాజకీయాల్లో ఒక జోకర్ అని  ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి. తాను ఏక్ నాథ్  షిండేను అవునో కాదు భగవంతునికి తెలియాలి కానీ..   మహేశ్వర్ రెడ్డి మాత్రం కిషన్ రెడ్డికి, ఈటెల రాజేందర్ కు వెన్నుపోటు పొడిచే నయా గాలి జనర్ధన్ రెడ్డి అని విమర్శించారు.  మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యాల వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. కాంగ్రెస్ లో పుట్టిన తాను  కాంగ్రెస్ జెండాతోనే పోతానని...  కోమటిరెడ్డి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే కోమటిరెడ్డి అని స్పష్టం చేశారు.