కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. డిసెంబర్ 10వ తేదీ ఆదివారం సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను మంత్రి వెంకట్ రెడ్డి కలిసి పరామర్శించారు. తర్వాత కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్ కు గాయం కావడం బాధాకరమని.. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.  కేసీఆర్ ఆరోగ్యం గురించి కేటీఆర్, కవితతో చర్చించానని చెప్పారు. కేసీఆర్  త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు.  మంత్రి వెంకట్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎంపీ వి హన్మంతరావు, కోదండ రెడ్డి, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్, ఎంపీ  గుండూరు రాములు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్  తదితరులు కేసీఆర్ ను పరామర్శించారు.

డిసెంబర్ 7వ తేదీ గురువారం అర్థరాత్రి ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో కేసీఆర్.. బాత్ రూమ్ లో కాలు జారి పడడంతో ఆయనను హుటాహుటిన సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ కు తుంటి ఎముక విరిగినట్లు గుర్తించిన వైద్యులు.. ఆయనకు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు. ఆయనకు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.