ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు

ముగిసిన మల్లన్న బ్రహ్మోత్సవాలు
  • చివరి వారం ఘనంగా అగ్నిగుండాలు

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆనవాయితీ ప్రకారం చివరి వారం అగ్నిగుండాల కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి ప్రారంభించి సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి అగ్నిగుండాల వద్ద పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం అర్చకులు ఉత్సవ విగ్రహాలను పట్టుకుని అగ్నిగుండాలు దాటిన అనంతరం భక్తులు దాటి మొక్కులు చెల్లించుకున్నారు. చివరి ఆదివారం బుకింగ్ ఆదాయం రూ.48,11, 594  వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో కేదార్నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ శివలింగ స్వామి, ఆలంపల్లి కంపిన మఠాధీశ్వరుడు శ్రీ చెన్నబసవ స్వామి, ఆలయ ఈవో బాలాజీ, టెంపుల్ చైర్మన్ లక్ష్మారెడ్డి, ఏఈవోలు బుద్ది శ్రీనివాస్, కత్తి శ్రీనివాస్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ నాగరాజు, సూపరింటెండెంట్​ చంద్రశేఖర్, ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.