కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదు : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి 

కొండా సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదు : మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి 
  • పరకాలలో దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడు
  • అక్కడి నుంచి నా కూతురు రాజకీయాల్లోకి ప్రవేశం 
  • స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‍ ని భ్రష్టుపట్టిస్తుండు 
  • బయటి నుంచి వచ్చినోళ్లు ఇజ్జత్‍ ఉంటే రాజీనామా చేయాలి
  • డిపార్ట్ మెంట్ లోని కోవర్టులపై పోలీసు కమిషనర్ ఫోకస్‍ పెట్టాలే 
  • మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వివాదాస్పద  వ్యాఖ్యలు

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: “కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. పదవి ఎక్కడికీ పోదు.. మా వెనక రాహుల్‍గాంధీ, రేవంత్‍రెడ్డి ఉన్నారు”.. అని మంత్రి సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. గురువారం రాహుల్‍గాంధీ బర్త్ డే సందర్భంగా గురువారం వరంగల్ పోచమ్మ మైదాన్‍లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎర్రబెల్లి, పోలీస్‍ ఉన్నతాధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరకాలలో 75 ఏండ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచాడని, ఎన్నికలప్పుడు వచ్చి.. ఒక్కసారి గెలిపించాలని, మరోసారికి తమకు వదిలేస్తానని మాటిచ్చాడని గుర్తుచేశారు. అక్కడి నుంచి త్వరలోనే తన కూతురు కొండా సుస్మిత పటేల్‍ రాజకీయ ప్రవేశం చేస్తారని, జనాలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు.

టీడీపీ నుంచి వచ్చిన  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‍ ను భ్రష్టుపట్టిస్తున్నాడని, ఆయన ఎన్‍కౌంటర్లలో స్పెషలిస్ట్ అని, చంద్రబాబు, కేసీఆర్‍, కేటీఆర్‍ను వెన్నుపోటు పొడిచివచ్చాడని, అతనితో రేవంత్‍రెడ్డి జాగ్రత్తగా ఉండాలని  కడియం శ్రీహరిని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ‘ కొండా మురళి లెక్క మీకు ఇజ్జత్‍, మానవత్వం ఉంటే బయట పార్టీ నుంచి వచ్చినోళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని’ సవాల్ చేశారు.

ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్లేనని, అందుకే వదిలేస్తున్నానన్నారు. తనకు ఎస్కార్ట్ గా వచ్చినవారిపై చర్యలు తీసుకోవడం మీద పెట్టే శ్రద్ధ పోలీస్‍ డిపార్టుమెంట్ లోని కోవర్టులపై  పెట్టాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఉద్దేశించి కామెంట్స్ చేశారు.  వరంగల్‍ తూర్పులో తను ఉన్నంత కాలం రెండో లీడర్‍ ఉండరని కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బీసీ నేతను కాబట్టే తనపై కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆపరేషన్‍ కగార్‍ నిలిపివేయాలని తాము ఆందోళనలు చేస్తామంటే పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఇప్పుడు జిల్లాకు చెందిన బీసీ బిడ్డ ఎన్‍కౌంటర్‍ అయ్యాడన్నారు. ‘ నాకు నామినేటెడ్‍ పోస్ట్ వస్తుందని, అయితే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లను గెలిపించుకోవాలే. పైసలిచ్చి ఓట్లేయించుకోవాలే. ఇక నా పని ఇదే..”అంటూ మాట్లాడారు. ధైర్యంలో తాను పెద్దపులి కంటే ఎక్కువన్నారు.