దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తున్నది మోదీనే : కొండా విశ్వేశ్వర్ రెడ్ది

దేశాన్ని, ధర్మాన్ని రక్షిస్తున్నది మోదీనే : కొండా విశ్వేశ్వర్ రెడ్ది

వికారాబాద్, వెలుగు : దేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఏకైక నేత ప్రధాని మోదీ మాత్రమేనని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం వికారాబాద్ లోని కొండా బాలకృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశం మొత్తం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ నినదిస్తోందన్నారు. మోదీ సర్కార్ పై  ప్రతిపక్షాలది దుష్ప్రచారమేనని ఆరోపించారు. 

ఫ్రీ బస్సు టికెట్ ఇచ్చి మొత్తం ఇచ్చినట్టుగా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓడిపోతారన్నారు. గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి పోలీసులు, అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమంగా గెలిచారని ఆయన ఆరోపించారు. తను ఎంపీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించిన రంజిత్ రెడ్డికి ఇప్పుడు వారెలా సహకరిస్తారని ప్రశ్నించారు.

కోళ్ల దాణా స్కాం, అంగన్ వాడి గుడ్ల కుంభకోణాలతో రూ. కోట్లలో ప్రజాధనాన్ని రంజిత్ రెడ్డి కాజేశారని ఆరోపించారు. కబ్జాలు అక్రమాలతోనే ఆయన రెడ్డి రాజకీయం నడుస్తుందన్నారు. ఈ సమావేశంలో వికారాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, కోట్ పల్లి ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ శ్రీదేవి, ధారూర్ మాజీ ఎంపీపీ రాజు నాయక్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్, యువ నేత వడ్ల నందు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు నవీన్ కుమార్ పాల్గొన్నారు.