పరిగి, వెలుగు: ‘రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్లు చరిత్రలో లేదు’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని రాపోల్, కళ్లాపూర్ గ్రామాల్లో భూ సేకరణకు వ్యతిరేకంగా రైతులు గత 14 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. సోమవారం దీక్షా శిబిరానికి చేరుకొని రైతులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.
ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో ప్రభుత్వం భూసేకరణ చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏండ్ల కింద గండీడ్ మండలంలో పరిశ్రమల కోసం భూమి సేకరించినా ఇప్పటికీ అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రైతుల భూములను కాపాడేందుకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
