కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర పాలన : కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్ర పాలన : కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

వికారాబాద్, వెలుగు: ప్రధాని మోదీ నిస్వార్థంతో దేశానికి సేవ చేస్తున్నారని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంతాపూర్, కందవెల్లి, ఘాజీపూర్, గొట్లపల్లి, గింగుర్తి, అడికిచెర్ల, తట్టిపల్లి, నాగులపల్లి, గోపాల్ పూర్, పెద్దముల్, మర్రిపల్లిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని మోదీ దేశ ప్రజల సంక్షేమానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారన్నారు.

బీఆర్ఎస్  రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవంటున్న కాంగ్రెస్ నేతలు ఎవరిని మోసం చేసేందుకు ఆరు గ్యారెంటీలను తెచ్చారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రాన్ని నడిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పలువురు స్థానికులు తమ గ్రామాల్లోని మౌలిక వసతులు కల్పించాలని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీగా గెలవగానే వెంటనే పనులను ప్రారంభిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, నేతలు భద్రేశ్వర్, లలిత, అమర్ నాథ్ రెడ్డి, బూత్ అధ్యక్షుడు సూర్యకాంత్, పాండు, శ్రీను, కాశీ, ప్రభునాథ్, తులసీ, జనార్దన్, అరవింద్ పాల్గొన్నారు.