బడంగ్ పేట,వెలుగు : ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు 5 ఎకరాల భూమి, రూ. 10 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని మహేశ్వరానికి చెందిన పార్టీ బహష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి పార్టీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేశారు. రూ. 10 కోట్లు ఇచ్చామని చెప్పుకుంటున్న చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఆయన తన ఇంట్లో నిర్వహించిన మీడియాసమావేశంలో మాట్లాడారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఆరోపణలు నిజం కాకపోతే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేయాలని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తాను మహేశ్వరం నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. తన భవిష్యత్ను త్వరలో ప్రకటిస్తానని ఆయన తెలిపారు.