భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సంత్ సేవాలాల్ బోధనలు మానవాళికి ఆదర్శమని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని కలెక్టరేట్ సమీపంలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని బోగ్ బండార్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తండాల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం కృషి చేయాలని, అడవి బిడ్డల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేశ్ను తలపాగాతో సన్మానించారు.
అంతకుముందు జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్లో ఫారెస్ట్ ఆఫీసర్స్, పోడు రైతులు, స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. ఏజెన్సీలో అభివృద్ధి పనులకు అటవీశాఖ సహకరించాలని కోరారు. పోడు సాగుదారులపై నిర్భందాలు ఆపాలని, భూములను లాక్కొని వారి పొట్ట కొట్టవద్దన్నారు.
