రెండు రోజుల క్రితం హైదరాబాద్ కోఠి ఎస్బీఐ బ్యాంకు దగ్గర కాల్పుల ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలతో ఉడాయించారు దొంగలు. అయితే వారి ఆచూకీ పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్న ఐదు ప్రత్యేక బృందాలు సిటీని జల్లెడపడుతున్నాయి.అణువణువు గాలిస్తున్నా దొరకడం లేదు. అయితే పక్కా ప్లాన్ తో పోలీసులకు దొరక్కుండా తప్పుదారి పట్టిస్తూ పలు ఆటోలు ఎక్కి సిటీలోనే చక్కర్లు కొడుతున్నారు కేటుగాళ్లు.
రెండు రోజుల నుంచి ఇద్దరు కేటుగాళ్లు పలు ఆటోలు మారుతూ శనివారం మొత్తం టైంపాస్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన ఒక రోజు వరకు సిటీ నుంచి బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడ్డ దొంగలు కాచిగూడ రైల్వే స్టేషన్ కు వెళ్లినట్టే వెళ్లి స్టేషన్ లోపలకి వెళ్లలేదు. కాచిగూడ నుంచి మళ్ళీ ఆటో తీసుకుని చాంద్రాయణగుట్ట వైపు వెళ్లారు నిందితులు. ఘటన జరిగిన వెంటనే ట్రైన్ లో వెళితే పట్టుబడుతామని ఊహించి ప్లాన్ మార్చుకున్నారు కేటుగాళ్లు. ఇలా పోలీసులను తప్పుదారి పట్టిస్తూ ఒక రోజు గడిచాక సిటీ దాటిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నార్త్ స్టేట్ లకు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కేరళకు చెందిన రిన్షాద్ అనే వ్యాపారి శనివారం (జనవరి 31) ఉదయం 7 గంటల ప్రాంతంలో డబ్బులు డిపాజిట్ చేసేందుకు కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం దగ్గర ఏటీఎమ్కు వెళ్లాడు. ఈ క్రమంలో రిన్షాద్ ను ఫాలో అయిన ఇద్దరు దుండగులు ముసుగు వేసుకుని వచ్చారు. ఏటీఎంలో డబ్బులు (రూ.6లక్షలు) డిపాజిట్ చేస్తుండగా రిన్షాద్ పై కాల్పులు జరిపి డబ్బుతో ఉన్న బ్యాగ్ ను లాక్కెళ్లి బైక్ పై పారిపోయారు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమరాలో రికార్డ్ అయ్యింది .దుండగులు జరిపిన కాల్పుల్లో బాధితుడు రిన్షాద్ కాలులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మరో బుల్లెట్ మిస్ ఫైర్ అయ్యింది. ప్రస్తుం రిన్షాద్ మలక్ పేట యశోద లో చికిత్స పొందుతున్నాడు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలాన్ని పరిశీలించారు. రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
