జైలు నుంచి విడుదలై.. మళ్లీ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

జైలు నుంచి విడుదలై.. మళ్లీ చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్: పగలు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని కేపీహెచ్ బి పోలీసులు పట్టుకున్నారని తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. కొన్ని రోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఆవుల కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. ఇతడు పగలు బైక్ పై రెక్కీ చేసి దొంగతనం చేస్తున్నాడని..  7సంవత్సరాల నుంచి ఇతడు 90 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడన్నారు. ఇటీవల ఖమ్మం పోలీసులకు చిక్కి జైలుకు వెళ్ళాడని.. జూలైలో విడుదలైన ఆవుల కిరణ్.. మళ్ళీ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు.

రెక్కీ నిర్వహించి చోరి చేయడం ఇతని నైజమని.. నంబర్ ప్లేట్ లేని వాహనం, నల్ల హెల్మెట్ వాడుతూ చోరీలు చేస్తున్నాడని తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఇతడిపై 10 కేసులు ఉన్నాయని.. సీసీటీవీ కెమెరాల ద్వారా ఆవుల కిరణ్ ని పట్టుకున్నామని చెప్పారు. రూ. 16.70 లక్షల విలువ చేసే 30 గ్రాముల బంగారం, 829 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరో 60 తులాల బంగారం రికవరీ చేయాల్సి ఉందని తెలిపారు సీపీ సజ్జనార్.