Letter to Editor: కృష్ణా మిగులు జలాలను ‘పాలమూరు’కు కేటాయించాలి

Letter to Editor: కృష్ణా మిగులు జలాలను ‘పాలమూరు’కు కేటాయించాలి

ఏపీ ప్రభుత్వం గోదావరి బనకచర్ల లింక్‌‌‌‌ప్రాజెక్టు ద్వారా 200 టీఎంసీలను బనకచర్ల మీదుగా పెన్నా  బేసిన్‌‌‌‌కు మళ్లించాలని చూస్తోంది. అయితే,  కృష్ణా జలాల్లో ఏర్పడే మిగులు జలాలను ఉమ్మడి పాలమూరు జిల్లాకే కేటాయించాలి.  ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌‌‌‌ సర్కారు ఒత్తిడి తీసుకురావాలి. ఈ మేరకు ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలను వినిపించాలి.  

పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌రెగ్యులేటరీ, హంద్రినీవా, గాలేరు నగరి సుజల స్రవంతి, ముచ్చుమర్రి, మల్యాల తదితర లిఫ్ట్‌‌‌‌లను అక్రమంగా నిర్మించడమే గాక, అంతకంతకూ విస్తరిస్తూ ఏటా కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌‌‌‌కు ఏపీ మళ్లిస్తోంది.  దీంతో  బేసిన్‌‌‌‌లోని, కృష్ణానది పక్కనే ఉన్న ఉమ్మడి మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌, నల్గొండ జిల్లాలకు నదీ జలాలు దక్కని దుస్థితి నెలకొన్నది.

  దశాబ్దాలుగా సాగు, తాగునీరు అందక  పాలమూరు ప్రాంతం కరువు బారిన పడింది.  ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రైతులు ఒక్క పంట కోసం తహతహలాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి బనకచర్ల లింక్‌‌‌‌ ప్రాజెక్టును చేపడుతుంది. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను పెన్నా బేసిన్‌‌‌‌కు తరలించనుంది. ఫలితంగా కృష్ణా జలాల్లో మిగులు ఏర్పడుతుంది. 

ఆ జలాలను ఉమ్మడి పాలమూరు బేసిన్‌‌‌‌లోని నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకే కేటాయించాలి. అదేవిధంగా పోలవరం డైవర్షన్‌‌‌‌ ద్వారా వచ్చే 45టీఎంసీలను ఇప్పటికే గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయించింది. ఆ జలాల వినియోగానికి సైతం ఏపీ అంగీకరించాలి.  ఉమ్మడి రాష్ట్రంలో చేసిన జలద్రోహాలను ఇకనైనా సరిదిద్దాలి.

 తెలంగాణ దుర్బిక్ష ప్రాంతాలకు న్యాయం చేసేందుకు రేవంత్​ సర్కార్​ సహకరించాలి.  కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఇదే విషయమై కేంద్రం, ఏపీపై ఒత్తిడి తేవాలి. ట్రిబ్యునల్‌‌‌‌లో వాదనలను వినిపించాలి. లేదంటే రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకున్న తరహాలోనే జీబీ లింక్‌‌‌‌ను అడ్డుకుంటాం.

- గవినోళ్ల శ్రీనివాస్‌‌‌‌, సామాజిక కార్యకర్త-