మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు .. పోటీల్లో ఇదే చివరి ప్రశ్న

మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తారు .. పోటీల్లో ఇదే చివరి ప్రశ్న
  • మరికొద్ది గంటల్లో తేలనున్న విశ్వవిజేత 

హైదరాబాద్, వెలుగు: మిస్​వరల్డ్​పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది గంటల్లో  విశ్వసుందరీ ఎవరో తేలనున్నది. ఆఖరి ఘట్టంపై యావత్​ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 108 మంది పోటీదారుల్లో  ప్రతి ఖండం (అమెరికా అండ్ కరీబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా అండ్​ఓషియానియా) నుంచి 10 మంది సెమీ ఫైనలిస్టులు, మొత్తం 40 మంది క్వార్టర్ ఫైనల్స్ కు చేరారు. కొందరు పోటీదారులు ఫాస్ట్-ట్రాక్ చాలెంజ్‌‌‌‌ల ద్వారా ఇప్పటికే క్వార్టర్ ఫైనల్స్‌‌‌‌ కు చేరుకున్నారు. చివరగా నలుగురిని ఎంపిక చేస్తారు. మిస్​ వరల్డ్​ టైటిల్ సాధిస్తే ఏం చేస్తారు? అనే ప్రశ్న పోటీల్లో చివరిది. ఆ ప్రశ్నకు అందాలభామలు ఇచ్చే సమాధానం ఆధారంగా విశ్వసుందరిగా  ప్రకటిస్తారు. 2024 లో మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా పిస్కోవా ఈ సారి విజేతకు కిరీటం అందజేయనున్నారు. జూన్​2న మిస్​వరల్డ్​ విజేత రాజ్​భవన్​లో గవర్నర్​జిష్ణుదేవ్​ వర్మను కలవనున్నారు.

టైటిల్​ గెలిస్తే ఇండియా నంబర్​ వన్

మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాకు ఘనమైన రికార్డు ఉంది. మిస్ వరల్డ్ పోటీల్లో అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశాల్లో ఇండియా టాప్​లో ఉంది. తొలిసారిగా 1966లో ఇండియాకు మిస్ వరల్డ్ టైటిల్ దక్కింది. ముంబైకి  చెందిన రీటా ఫరియా విశ్వసుందరిగా నిలిచారు. 1994లో ఐశ్వర్య రాయ్, 1997లో డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ మిస్ వరల్డ్ విజేతలుగా నిలిచారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఇండియాతోపాటు వెనుజులా దీటైన పోటీ ఇస్తూ వస్తోంది. ఇండియాతో సమానంగా  ఆరు టైటిల్స్ కైవసం చేసుకుంది. వెనుజులా తర్వాత యునైటెడ్ కింగ్​డమ్​ ఐదు టైటిల్స్ తో రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి నందిని గుప్తా మిస్​ వరల్డ్ సాధిస్తే.. అత్యధిక టైటిల్స్ సాధించిన దేశంగా ఇండియా నిలవనున్నది.