
హైదరాబాద్లో ప్రపంచ స్థాయి బయోటెక్ హబ్ ఏర్పాటు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని శామీర్ పేట్ మండలం తుర్కపల్లిలోని జీనోమ్ వ్యాలీలో కెమో ఇండియా ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ క్యాంపస్లో తొలిసారిగా ఒలిగో న్యూక్లియోటైడ్స్ క్యాన్సర్ చికిత్స మందుల కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం సింజీన్ ఇంటెల్ రీసెర్చ్ లాబొరేటరీ విస్తరణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘సింజీన్ విస్తరణ మన రాష్ట్రం అందించే అద్భుతమైన అవకాశాలు నిదర్శనం. జీనోమ్ వ్యాలీలో కార్యకలాపాలను ప్రారంభించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, సహాయక వ్యవస్థలను సులభతరం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థికాభివృద్ధి వంటి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తాం” అని కేటీఆర్ పేర్కొన్నారు.
రూ.788 కోట్లు పెట్టుబడులు పెడతాం: కిరణ్ మజుందార్ షా
భారీ నూతన పరిశోధన, అభివృద్ధి సౌకర్యాలతో జీనోమ్ వ్యాలీలో సింజీన్ కార్యకలాపాలను విస్తరించడం సంతోషంగా ఉందని సింజీన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా అన్నారు. తద్వారా అదనపు ఉద్యోగాలను సృష్టించి బయోటెక్ పరిశ్రమ వృద్ధికి దోహదపడేందుకు ఇది ఉపయోగ పడుతుందన్నారు.
దేశంలోని బయోటెక్ ఎకో సిస్టమ్ను బలోపేతం చేయడానికి, ఆవిష్కరణల కోసం రాబోయే కాలంలో జీనోమ్ వ్యాలీలో రూ.788 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నామని తెలిపారు.హైదరాబాద్లో ప్రపంచ స్థాయి బయోటెక్ హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. కార్యక్రమంలో సిన్ ఇంటర్నేషనల్ ఎండీ, సీఈవో జోనాథన్ హంట్, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.