- 215 పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టాయి
- ఫార్మా రంగంలో కొత్తగా 34 వేల జాబ్స్ వచ్చాయని వెల్లడి
- బయో ఏషియా సమ్మిట్ ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీ, తెలంగాణ రాష్ట్రం ప్రపంచ ఫార్మా హబ్గా అవతరించాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం సాయంత్రం బయో ఏషియా సమ్మిట్ ప్రారంభించిన ఆయన మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్తో ‘ఫైర్సైడ్ చాట్’లో మాట్లాడారు. కరోనాతో ఎదురైన సవాళ్లు,హెల్త్కేర్ సెక్టార్లో వచ్చిన మార్పులు, లైఫ్సైన్సెస్ సెక్టార్ భవిష్యత్తు తదితర అంశాలపై గేట్స్తో చర్చించారు. హెల్త్ సెక్టార్లో భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లు, కరోనా లాంటి వ్యాధులను ఎలా ఎదుర్కొంటారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేటీఆర్ గేట్స్ను ప్రశ్నించగా.. ‘‘కరోనా టైమ్లో ఇండియా ఫాస్ట్గా స్పందించింది. కరోనా వైరస్కు వేగంగా వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చారు. ఇక ముందు కూడా కరోనా లాంటి వైరస్లు వచ్చే అవకాశముంది. వ్యాక్సిన్లు, మందులు తయారు చేయడం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఖర్చుతో కూడుకున్నది. అయినా తక్కువ ధరకు ఇండియా కరోనా వ్యాక్సిన్ను అందుబాటులోకి తేవడం అభినందనీయం, ఓవర్నైట్లో మందులు తయారు చేయడం సాధ్యం కాదు. తయారు చేసిన వాటిని పరీక్షించడం, మనుషులపై ప్రయోగించేందుకు అనుమతులు తీసుకోవడానికి చాలా టైం పడుతుంది” అని బిల్గేట్స్ అన్నారు.
రూ.6,400 కోట్ల పెట్టుబడులు వచ్చాయి
వర్చువల్గా నిర్వహించిన బయో ఏషియా సమ్మిట్లో 72 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కరోనా విపత్తు తర్వాత ప్రపంచం హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఇందులో చర్చించారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టిన ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాలతో హెల్త్ కేర్, లైఫ్సైన్సెస్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించామన్నారు. 215 ప్రముఖ కంపెనీలు రూ.6,400 కోట్ల పెట్టుబడులు పెట్టాయన్నారు. 34 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. హెల్త్ కేర్ రంగంలో అంతకుముందు కన్నా 200 శాతం అదనంగా పెట్టుబడులు ఆకర్షించామన్నారు. తాము ఏర్పాటు చేస్తున్న మెడికల్ డివైజెస్ పార్క్లో 50 కంపెనీలు తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయని, వీటితో 7 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ సందర్భంగా జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును పెన్సిలేన్వియా యూనివర్సిటీ డాక్టర్ డ్రూవెససిమన్కు అందజేశారు. ఎంఆర్ఎన్ఏ కోవిడ్ - 19 వ్యాక్సిన్ తయారు చేసినందుకు ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. ఈ సమ్మిట్లో నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్, డాక్టర్ రాజేశ్ గోఖలే, డాక్టర్ పీటర్ పోయెట్, డాక్టర్ కృష్ణా ఎల్లా, మహిమ దాట్ల, గగన్దీప్, డాక్టర్ డేవిడ్ రెహ్యూ, అశ్వినీ మాథుర్, జయేశ్ రంజన్, మదన్ కృష్ణన్, భార్గవ్ కొటాడియా, రాజీవ్నాథ్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సవాళ్లు ఎదుర్కొనేందుకు రెడీ
ఎంఆర్ఎన్ఏపై పరిశోధనలకు గేట్స్ ఫౌండేషన్ ఎంతగానో తోడ్పాటునందిస్తుందని, తెలంగాణ ప్రభుత్వం ఈ ఫౌండేషన్తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనిపై బిల్గేట్స్ సందిస్తూ.. ఎంఆర్ఎన్ఏ వైరల్ వెక్టార్, ప్రొటీన్ సబ్మ్యూటిన్ అని, యూఎస్, యూరప్కు వెలుపల దీనిపై పనిచేయడం సాధ్యం కాదన్నారు. ఇండియాలో గేట్స్ - మెలిండా ఫౌండేషన్ ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నదని వివరించారు. హెచ్ఐవీ, సికిల్ సెల్ డిసీజ్లకు జీనోమ్ థెరపీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కేటీఆర్ స్పందిస్తూ.. కరోనాను కట్టడి చేసే రెండు వ్యాక్సిన్లు హైదరాబాద్లోనే తయారయ్యాయని తెలిపారు. కొత్త వైరస్లకు మందుల తయారీ నిరంతర ప్రక్రియ అని, భవిష్యత్లో సవాళ్లను ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నామన్నారు.