నల్గొండ, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇటు సంక్షేమం, అటు అభివృద్ధి అనే జోడెడ్లతో రాష్ట్రం ముందుకెళుతోందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పెద్దపెద్ద మాటలంటున్న ఇప్పటి ప్రతిపక్ష నేతలు.. అప్పట్లో కనీసం కరెంట్ ఇచ్చిన పాపానపోలేదన్నారు. ఇప్పుడేమో గొంతు చించుకుని రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చినంక టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు ఫ్రీ కరెంట్ఇవ్వడంతో పాటు రైతు చనిపోయిన వారంలోనే రూ.5 లక్షల పరిహారం ఇస్తోందన్నారు. శుక్రవారం నల్గొండలోని పాలిటెక్నిక్ కాలేజీలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్రెడ్డిలతో కలిసి ఆయన ఐటీ హబ్కు శంకుస్థాపన చేశారు. అప్పటి నాయకులు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ సమస్యను పట్టించుకోనేలేదని, కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఆ సమస్యను పరిష్కరించిందని అన్నారు. నల్గొండ ఐటీ హబ్ కూడా కేసీఆర్ పుణ్యమేనన్నారు. 16, 17 నెలల్లో నల్గొండ ఐటీ హబ్ అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకు తాత్కాలిక బిల్డింగ్లో సెంటర్ను ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జాబ్లు ఇయ్యలేదని నిరూపిస్తే రాజీనామా చేస్త: ప్రశాంత్ రెడ్డి
రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపక్షాలకు ప్రశాంత్రెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. టీఎస్ఐపాస్ ద్వారా కొత్తగా 17 వేల ఇండస్ట్రీలు వచ్చాయని, వాటి ద్వారా 12 లక్షల నుంచి 13 లక్షల మందికి ఉపాధి దొరికిందని అన్నారు. గతంలో ‘ఐ’, ‘టీ’ అంటే ఏంటో కూడా తెలియనోళ్లు ఐటీ మంత్రులుగా పనిచేశారని జగదీశ్రెడ్డి అన్నారు.
నల్గొండ రూపు రేఖల్ని మారుస్తం
నల్గొండ రూపు రేఖల్ని పూర్తిగా మార్చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నల్గొండ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కరోనా వల్ల నల్గొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు లేట్ అయ్యాయని చెప్పారు. సీఎం హామీ మేరకు కేటాయించిన రూ.100 కోట్ల నిధుల్లో ప్రస్తుతం రూ.70 కోట్లు విడుదల చేస్తామని, త్వరలోనే మిగతా రూ.30 కోట్లను రిలీజ్ చేస్తామని చెప్పారు. కొత్తగా ఐదు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.4.50 కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్లు, రూ.3 కోట్లతో వైకుంఠధామాలను కడతామన్నారు.