
- సిరిసిల్లలో వార్రూమ్ ఏర్పాటు చేశారు
- సిటీ సీపీ శ్రీనివాస్రెడ్డికి కాంగ్రెస్ నేత ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, సిరిసిల్ల ఇన్చార్జ్ కేకే మహేందర్రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతి లేకుండా వ్యక్తిగత సమాచారం సేకరించిన కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్లలో వార్రూమ్ ఏర్పాటు చేసి, తన ఫోన్తోపాటు తన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని మహేందర్రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు సోమవారం మహబూబ్ నగర్ ఎమ్యెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డితో కలిసి హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనంతరం మహేందర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు నామమాత్రంగా ఉన్నారన్నారు. కేసీఆర్ కుటుంబం భావ స్వేచ్ఛ లేకుండా చేసిందని మండిపడ్డారు. సిరిసిల్లలో వార్రూమ్ నుంచి తన ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. తనను బీఆర్ఎస్లోకి రావాలని గతంలో పిలిచారని, ఆ టైంలోనే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్నారు.