కాళేశ్వరం ప్రాజెక్టు.. త్రీగోర్జెస్​కు సరిసమానం : కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టు.. త్రీగోర్జెస్​కు సరిసమానం : కేటీఆర్
  • ప్రతి సీజన్​లో 45 లక్షల ఎకరాలకు నీళ్లిస్తున్నం: కేటీఆర్
  • లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ సదస్సులో వ్యాఖ్యలు

హైదరాబాద్, వెలుగు: దృఢ నాయకత్వం, ప్రజల జీవితాలను మార్చాలన్న చిత్తశుద్ధి ఉంటే అద్భుతమైన ప్రగతి సాధ్యమని తెలంగాణ నిరూపించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పుకునే చైనాలోని త్రీగోర్జెస్ డ్యామ్​కు సరిసమానమైన కాళేశ్వరం ప్రాజెక్టును తమ పాలనలో నిర్మించామని చెప్పారు. శుక్రవారం లండన్​లో నిర్వహించిన బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళ ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంతో.. సముద్ర మట్టానికి 80 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తు వరకు నీటిని తీసుకెళ్లామన్నారు. ప్రతి సీజన్​కూ 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని చెప్పారు.

 ఇండియా లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాజెక్టును నిర్మించడం చాలా కష్టమని, అందుకు అన్ని రకాల అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వాటన్నింటినీ దాటుకుని ప్రాజెక్టుతో నష్టపోయిన నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం మూడేండ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం నివ్వెరపోయేలా చేశామని పేర్కొన్నారు. తలసరి ఆదాయంలో 12వ స్థానం నుంచి తెలంగాణ మొదటి స్థానానికి తమ హయాంలోనే ఎదిగిందని చెప్పారు. ప్రతీ ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని 
అందించామని కేటీఆర్ చెప్పారు.