బెదిరించి.. బుజ్జగించి దారికి తెస్తున్నమంత్రి

బెదిరించి.. బుజ్జగించి దారికి తెస్తున్నమంత్రి
  • మధ్యాహ్నం వరకు కొనసాగిన స్టేషన్ లొల్లి
  • ఒక్కటైన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య
  • లోనికి వెళ్లిన జనగామ నియోజకవర్గ లీడర్లు! 
  • ముగ్గురిలో టికెట్లు ఎవరికి కేటాయిస్తారో...? 

హైదరాబాద్: బీఆర్ఎస్ లో టికెట్లు దక్కని అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. ఇవాళ స్టేషన్ ఘన్ పూర్, జనగామ సెగ్మెంట్ల నేతలతో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిర్చారు. కొంత కాలంగా కొంత కాలంగా ఉప్పు నిప్పులా కొనసాగుతున్న ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు కేటీఆఆర్ చొరవతో ఒక్కటయ్యారు. సిట్టింగులకు సీట్లు కేటాయించిన కేసీఆర్ స్టేషన్ ఘన్ పూర్ స్థానాన్ని రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రాజయ్య తీవ్రంగా కలత చెందారు. ఒక దశలో కార్యకర్తల సమక్షంలోనే బోరున విలపించారు కూడా.. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. రాజీ కుదిర్చేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసేందుకు కూడా రాజయ్య నిరాకరించారు. చాలా సేపు రాజయ్య ఇంటి వద్ద వేచి ఉన్న పల్లా నిరాశతోనే వెనుదిరిగారు. ఇవాళ మంత్రి కేటీఆర్ మంత్రాంగం మాత్రం ఈ విషయంలో ఫలించింది. ఇద్దరు నేతలను ప్రగతి భవన్ కు పిలిపించి చర్చలు జరిపారు కేటీఆర్. రాజకీయ భవిష్యత్ కు గ్యారెంటీలు ఇచ్చారు. కడియం గెలుపుకోసం పనిచేయాలని రాజయ్యకు సూచించారు. ఆ తర్వాత ఇద్దరితోనూ చర్చించి సయోధ్య కుదిర్చారు. 

జనగామ లీడర్లతో కేటీఆర్‌‌ భేటీ

జనగామ టికెట్ ను పెండింగ్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఈ ముగ్గురు నేతలను ఇవాళ ప్రగతి భవన్ కు పిలిపించారు. మధ్యాహ్నం ఈ ముగ్గురు నేతలు కేటీఆర్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య సయోధ్య కుదిర్చిన తర్వాత టికెట్ ఎవరికి కేటాయిస్తారనేది తేలనుంది.