
కూకట్పల్లి, వెలుగు: సీఎం రేవంత్రెడ్డిపై పోటీ చేసే స్థాయి కేటీఆర్కి లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దమ్ముంటే మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీ నుంచి సాధారణ కార్యకర్తను బరిలో దింపుతామని కేటీఆర్కు సవాల్ విసిరారు. పదేండ్లు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్న బీఆర్ఎస్ లీడర్లను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు జిమ్మిక్కులు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. గురువారం సాయంత్రం కేపీహెచ్బీ కాలనీలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ఇన్చార్జ్ బండి రమేశ్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
అనంతరం టెంపుల్ బస్టాప్వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల అతిథిగా పాల్గొని మాట్లాడారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన బీఆర్ఎస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో ఓడించి, కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బండి రమేశ్ మాట్లాడుతూ బీఆర్ఎస్పాలనలో కూకట్పల్లిలో చేసిన అవినీతి, అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తున్నామన్నారు. అక్రమార్జనకు పాల్పడిన వారు తగినమూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్థన్రెడ్డి, నాయకులు కొప్పిశెట్టి దినేశ్కుమార్, శేరి సతీష్రెడ్డి, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, గాలి బాలాజీ పాల్గొన్నారు. మంత్రి తుమ్మల సమక్షంలో సీనియర్ నాయకులు మేకల మైఖేల్, సంజీవరావు కాంగ్రెస్లో చేరారు.