ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు: కేటీఆర్

ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలనలో ప్రతిపక్షాలు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా అనుమతి లేదా? అని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే చాలు ప్రజాప్రతినిధులపై దాడులకు తెగబడుతున్నారని ఆయన అన్నారు.  ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎమర్జెన్సీ రోజులను అమలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల అరెస్టులు, గృహ నిర్బంధాలను శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో ఖండించారు. 

‘‘బీఆర్ఎస్ పార్టీ సమావేశం పెట్టుకుంటే ముఖ్యమంత్రికి వణుకెందుకు. బీఆర్ఎస్ నేతలంటే సర్కారుకు ఎందుకింత భయమో చెప్పాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన అరికెపూడి గాంధీ అనుచరులైన కాంగ్రెస్ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వ దిగజారుడు విధానాలకు నిదర్శనం”అని ఆయన మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అన్నారు. తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులకు దిగే సంస్కృతిని తీసుకొచ్చారని కేటీఆర్​మండిపడ్డారు.