ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలె..8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులుండీ దండగ: కేటీఆర్

ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలె..8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులుండీ దండగ: కేటీఆర్
  •     పసుపు బోర్డుకుసొంత బిల్డింగునూ ఇవ్వలేదని ఫైర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం నుంచి బీజేపీకి 8 మంది ఎంపీలున్నా, ఇద్దరు కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్నా దండగేనని, రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకూ కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐఐటీ, ఐఐఎం, మెడికల్ కాలేజీ వంటి విద్యాసంస్థలనూ ప్రకటించలేదని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పసుపు బోర్డుకు నిధులు కేటాయించకుండా.. పసుపు బోర్డు ఆఫీసుకు రిబ్బన్ కట్ చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పసుపు బోర్డు కార్యాలయానికి సొంత భవనం నిర్మించకుండా.. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే ఆఫీసును ప్రారంభించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అసలు ఒక్క పసుపు బోర్డును ఇన్నిసార్లు ప్రారంభించడం అతిపెద్ద జోక్ అన్నారు.

పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేస్తున్నామని ఈ ఏడాది జనవరి 14న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభిస్తే, ఇవాళ పసుపు బోర్డు కార్యాలయాన్ని మరోసారి అమిత్ షా ప్రారంభించడం.. బీజేపీ జుమ్లా పనులకు, చెప్పే జూఠా మాటలకు నిదర్శనమన్నారు. 

బనకచర్లకు బంగారు బాటలు..

నదుల అనుసంధానం ముసుగులో ఏపీలోని టీడీపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్లకు కేంద్రం బంగారు బాటలు వేయడం గోదావరిపై తెలంగాణ రైతుల హక్కులను కాలరాయడమేనని కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫైర్ అయ్యారు. విభజన చట్టం  ప్రకారం అడవి బిడ్డలకు ఉపాధి కల్పించే బయ్యారం ఉక్కు కర్మాగారానికి పాతరేసి, హైదరాబాద్ రూపురేఖలు మార్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా రద్దు చేసి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు.

పేరుకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నా, నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకే అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంత ప్రజల గొంతు కోస్తున్న పచ్చి తెలంగాణ వ్యతిరేకి బీజేపీ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదని కేటీఆర్ అన్నారు.